ఇన్‌చార్జిల పాలన

ABN , First Publish Date - 2021-12-09T05:27:44+05:30 IST

ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని మండలాల్లో పలు ప్రధాన శాఖలకు ఇన్‌చార్జి అధికారులే దిక్కయ్యారు.

ఇన్‌చార్జిల పాలన
శిరివెళ్ల తహసీల్దార్‌ కార్యాలయం

  1. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువు
  2. రెగ్యులర్‌ అధికారుల కోసం ఎదురు చూపులు 


శిరివెళ్ల, డిసెంబరు 8: ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని మండలాల్లో పలు ప్రధాన శాఖలకు ఇన్‌చార్జి అధికారులే దిక్కయ్యారు. తహసీల్దార్‌, మండల పరిషత్‌, విద్య, వ్యవసాయం తదితర శాఖలకు రెగ్యులర్‌ అధికారులు లేరు. దీంతో  అదనపు భారంతో ఇన్‌చార్జులే బాధ్యతలు చూస్తు న్నారు. నెలల తరబడి రెగ్యులర్‌ అధికారులను నియమించకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల పర్యవేక్షణ కరువైంది. అధికారులకు క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలు తెలియడం లేదు. అదనపు బాధ్యతలతో వారు కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. దీంతో మండలాల్లో పరిపాలన గాడి తప్పుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  


 ఇదీ పరిస్థితి: శిరివెళ్ల మండలంలో ఏకంగా ఆరు ప్రధాన శాఖలకు రెగ్యులర్‌ అధికారులు లేరు. తహసీల్దార్‌, మండలపరిషత్‌, విద్య, పశువైద్యం, పంచాయతీరాజ్‌, గృహ నిర్మాణ శాఖలకు ఇన్‌చార్జి అధికారులు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోస్పాడు మండలం నుంచి ఎం ఈవో, దొర్నిపాడు మండలం నుంచి హౌసింగ్‌ ఏఈ, రుద్రవరం నుంచి పశువైద్యాధికారి, ఆళ్లగడ్డ నుంచి పంచాయతీరాజ్‌ ఏఈ శిరివెళ్ల మండలానికి వచ్చి పని చేస్తున్నారు. శిరివెళ్ల ఈవోపీఆర్డీ ఇన్‌చార్జి ఎంపీడీవోగా, ఉప తహసీల్దార్‌ ఇన్‌చార్జి తహసీల్దార్‌గా వ్యవహరిస్తున్నారు. ఉయ్యాలవాడ మండలంలో రెగ్యులర్‌ వ్యవసాయాధికారి లేకపోవడంతో అవుకు మండల వ్యవసాయాధికారి ఇన్‌చార్జిగా ఉన్నారు. రుద్రవరం మండలంలో ఎంపీడీవో, హౌసింగ్‌ ఏఈ, ఎంఈవోలుగా ఇన్‌చార్జిలే పని చేస్తున్నారు. ఆళ్లగడ్డ మండలంలో ఎంపీడీవోగా ఈవోపీఆర్డీ అదనపు బాధ్యతలు చేపడుతున్నారు. నంద్యాల పరిధిలోని గోస్పాడు మండల తహసీల్దార్‌గా ఉప తహసీల్దార్‌ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 



Updated Date - 2021-12-09T05:27:44+05:30 IST