కరోనా నిబంధనలు మరింత కఠినతరం
ABN , First Publish Date - 2021-05-19T07:47:32+05:30 IST
ఎన్ని ప్రయత్నా లు చేస్తున్నా కరోనా మహమ్మారి తన విశ్వరూపం చూపిస్తూనే ఉన్నందున బుధవారం నుంచి నిబంధనలను మరిం త కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి
కందుకూరు, మే 18: ఎన్ని ప్రయత్నా లు చేస్తున్నా కరోనా మహమ్మారి తన విశ్వరూపం చూపిస్తూనే ఉన్నందున బుధవారం నుంచి నిబంధనలను మరిం త కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి తెలిపారు. స్థానిక తహసీ ల్దార్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి ఎమ్మెల్యే మహీధర రెడ్డి విలేకరులతో మాట్లాడారు.నియంత్రణ చర్యలు చేపడుతున్నా ప్రజలు విచ్చలవిడిగా బయట తిరగటం వల్ల కరోనా వ్యాపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థితిలో బుధవారం నుంచి ప్రభుత్వం నిర్ధేశించిన సమయం తర్వాత కేవలం వాహనదారులే కాకుండా రోడ్లపై పాదచారులు కనిపించినా జరిమానాలు వేస్తామన్నారు. మందుల పేరుతో రోడ్లపై తిరగడం పరిపాటిగా మారిందన్నారు. ఇక ఆ అవకాశం లేకుండా అత్యవసర మందులు ఏమి అవసరమైనా టాస్క్ఫోర్స్ కమిటీ అధి కారులకు ఫోన్ చేస్తే వారే మీ ఇంటి వద్దకు చేర్చే ఏర్పాటు చేస్తారని తెలిపారు. మందుల పేరుతో ఎవరూ బయటకు రావద్దని స్పష్టం చేశారు. పాలు, ఇతర పాల పదార్థాల కొనుగోలు కూడా ఉదయం చేసుకోవాలని, సాయంత్రం అనుమతించబోమని స్పష్టం చేశారు.
కొందరు చిరు హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు లాక్డౌన్ సమయంలో కూడా పార్శిల్స్ ఇస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఇకమీదట అలా జరిగితే ఆయా హోటళ్లను సీజ్ చేసి కరోనా పూర్తిగా తగ్గిపోయి సాధారణ పరిస్థి తులు ఏర్పడే వరకు అనుమతించబో మని హెచ్చరించారు. పట్టణం నలు మూలలా ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద తనిఖీలు సక్రమంగా జరగడం లేదన్నారు. కరోనా బాధితులను కొవిడ్ కేర్ సెంటర్లకు తరలించకుండా వారి ఇంటివద్దనే ఉంచటం వల్ల గ్రామాలలో కరోనా వ్యాపిస్తోందని ప్రశ్నించగా చెక్పోస్టుల వద్ద పరిస్థితిలో మార్పు వచ్చేలా తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా బాధితులను కొవిడ్ కేర్ సెంటర్లకు తరలించేలా చూస్తామన్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ ఉద్యోగులకు బుధవారం ఉదయం బాలికల ఉన్నత పాఠశాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ డి.సీతారామయ్య, డీఎస్పీ కండే శ్రీనివాసరావు, సీఐ విజయకుమార్, ఎంపీడీవో విజయశేఖర్, కమిషనర్ మనోహర్, డాక్టర్ ఇంద్రాణి, డాక్టరు స్వాతి, సీడీపీవో లిడియమ్మ, ఎస్ఐలు కె. అంకమ్మ, కేకే తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.