ఆఫ్ఘనిస్థాన్‌లో భద్రత క్షీణించడం ఆందోళనకరం : జైశంకర్

ABN , First Publish Date - 2021-08-08T00:20:12+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో భద్రతకు సంబంధించిన పరిస్థితి వేగంగా

ఆఫ్ఘనిస్థాన్‌లో భద్రత క్షీణించడం ఆందోళనకరం : జైశంకర్

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌లో భద్రతకు సంబంధించిన పరిస్థితి వేగంగా క్షీణిస్తుండటంపై భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. కతార్ ప్రత్యేక దౌత్తవేత్త ముత్లాక్ బిన్ మజీద్ అల్ కహతానీతో భారత దేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ శనివారం సమావేశమయ్యారు. ఆఫ్ఘన్‌లో తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం జైశంకర్ ఇచ్చిన ట్వీట్‌లో, ఆఫ్ఘనిస్థాన్‌లో ఇటీవలి పరిస్థితులపై భారత దేశ దృక్పథాన్ని వివరించానని తెలిపారు. ఇటీవలి చర్చల్లో తాను తెలుసుకున్న ప్రాంతీయ ఆందోళనల గురించి కూడా తెలియజేశానన్నారు. 


భద్రతా పరిస్థితులు వేగంగా క్షీణించడం చాలా తీవ్రమైన విషయమని పేర్కొన్నారు.  సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలు, హక్కులకు రక్షణ, ప్రోత్సాహం లభించే పరిస్థితులు ప్రశాంతమైన, సుస్థిర ఆఫ్ఘనిస్థాన్‌కు అవసరమని తెలిపారు. 


విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ శృంగ్లా కూడా అల్ కహతానీతో చర్చించారు. దోహా శాంతి ప్రక్రియ, ఆఫ్ఘనిస్థాన్‌లో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులపై చర్చించారు. ఈ వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. 


అల్ కహతానీ ప్రస్తుతం భారత దేశంలో పర్యటిస్తున్నారు. కౌంటర్ టెర్రరిజం, సంఘర్షణల పరిష్కారానికి మధ్యవర్తిత్వంపై ఆయన కతార్  ప్రత్యేక దౌత్యవేత్త.


Updated Date - 2021-08-08T00:20:12+05:30 IST