కరోనా కేసులు పెరిగినా స్కూళ్లు తెరిచేందుకే దక్షిణ కొరియా మొగ్గు

ABN , First Publish Date - 2020-06-03T23:13:28+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ దక్షిణ కొరియా ప్రభుత్వం పాఠశాలలు తెరిచేందుకే మొగ్గుచూపుతోంది...

కరోనా కేసులు పెరిగినా స్కూళ్లు తెరిచేందుకే దక్షిణ కొరియా మొగ్గు

సియోల్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ దక్షిణ కొరియా ప్రభుత్వం పాఠశాలలు తెరిచేందుకే మొగ్గుచూపుతోంది. వారం రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూ వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇవాళ ఒక్కరోజే దక్షిణ కొరియాలో 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 11,590కి చేరినట్టు కొరియా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (కేసీడీసీ) వెల్లడించింది. కొవిడ్-19 కారణంగా ఇప్పటి వరకు ఇక్కడ 273 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు గ్రేటర్ క్యాపిటల్ ప్రాంతంలోని మేయర్లు, గవర్నర్లు నైట్‌క్లబ్బులు, బార్లు, చర్చిలు, వెడ్డింగ్ హాల్స్ మొత్తం మూసేశారు.


అయితే వైరస్ వ్యాప్తిని సైతం లెక్కచేయకుండా ప్రభుత్వం గత నెల నుంచే పాఠశాలలను దశల వారీగా తెరుస్తూ వస్తోంది. మే 20న హైస్కూల్ సీనియర్ క్లాసులు ప్రారంభం కాగా.. తాజాగా హైస్కూల్ ఫ్రెషర్స్, మిడిల్ స్కూల్ జూనియర్లు, మూడు, నాలుగు గ్రేడ్ ఎలిమెంటరీ విద్యార్ధులు సహా 18 లక్షల మంది పిల్లలు తరగతులకు హాజరు కానున్నారు. కాగా తమ దేశంలో 1950-53 కొరియా యుద్ధ సమయంలో కూడా పాఠశాలలు తెరిచినట్టు దక్షిణ కొరియా ప్రధాని చుంగ్ సయే-కయున్ వ్యాఖ్యానించడం గమనార్హం. ‘‘ప్రస్తుత కష్టాల కారణంగా పిల్లల భవిష్యత్తు, వారి కలల్ని మేము ఓడించ దల్చుకోలేదు..’’ అని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-03T23:13:28+05:30 IST