పీసీసీ కార్యాలయంలో పైలట్ పోస్టర్లు

ABN , First Publish Date - 2020-07-13T20:03:33+05:30 IST

రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం కొనసాగుతోంది. తన విధేయ ఎమ్మెల్యేతో కలిసి పార్టీని ..

పీసీసీ కార్యాలయంలో పైలట్ పోస్టర్లు

జైపూర్: రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం కొనసాగుతోంది. తన విధేయ ఎమ్మెల్యేతో కలిసి పార్టీని విడిచి పెట్టాలనే ఆలోచనలో ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఉన్నారని చెబుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు సంక్భోభం దిశగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాల ఆరోపణలపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తునకు దిగడం, పైలట్‌కు సైతం నోటీసులు వెళ్లడంతో గెహ్లాట్, పైలట్ మధ్య సంబంధాలు మరింత దిగజారినట్టు చెబుతున్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న దానిపై స్టేట్‌మెంట్లు రికార్డు చేసేందుకు రాజస్థాన్ పోలీసులు గెహ్లాట్, పైలట్‌లకు నోటీసులు జారీ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించే అవకాశాలున్నాయని గెహ్లాట్ అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో జైపూర్‌లోని ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంలో మరోసారి సచిన్ పైలట్ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.


మరోవైపు, గెహ్లాట్ నివాసంలో ఏర్పాటు చేసిన సీఎల్‌పీ సమావేశానికి 101 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్టు చెబుతున్నారు. 109 మంది ఎమ్మెల్యేలు గెహ్లాట్‌కు మద్దతుగా సంతకాలు చేసినందున ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌చార్జి అవినాష్ పాండే తెలిపారు. ఇందుకు భిన్నంగా 25 మంది ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నట్టు పార్టీ సీనియర్ నేత సూర్జేవాలాకు పైలట్ తెలిపినట్టు కూడా తెలుస్తోంది. ఈ పరిణామాలతో పార్టీ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

Updated Date - 2020-07-13T20:03:33+05:30 IST