యువరాజ్ తాజా ఛాలెంజ్ వీడియోపై సచిన్ సెటైర్
ABN , First Publish Date - 2020-06-01T22:28:30+05:30 IST
కరోనా వైరస్ను ఎదురుకొనే స్పూర్తి కలిగించేందుకు టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ‘కీప్ ఇట్ అప్’ అనే ఛాలెంజ్ను ప్రారంభించిన విషయం
ముంబై: కరోనా వైరస్ను ఎదురుకొనే స్పూర్తి కలిగించేందుకు టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ‘కీప్ ఇట్ అప్’ అనే ఛాలెంజ్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్ చేయాల్సిందిగా అతను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ని నామినేట్ చేశాడు. అయితే సచిన్ కాస్త వినూత్నంగా.. కళ్లకు గంతలు కట్టుకొని ఈ ఛాలెంజ్ను చేసి.. మళ్లీ యువరాజ్నే నామినేట్ చేశారు.
అయితే ఈ ఛాలెంజ్పై స్పందించిన యువీ తన కళ్లకు గంతలు కట్టుకొని ఛపాతీ కర్రతో బంతిని కొడుతూ.. వీడియో చేసి తన సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు. సచిన్ కూడా ఆ విధంగా ఛాలెంజ్ పూర్తి చేయాలని అతను మరోసారి నామినేట్ చేశాడు. అయితే దీనిపై సచిన్ విభిన్నమైన సెటైర్ వేశారు. తన ముందు ఖాళీ కంచం పెట్టుకున్న సచిన్.. యువరాజ్ను పరోటాలు పంపించాలని పేర్కొన్నారు.
‘‘యువీ నువ్వు నా ఛాలెంజ్కి చాలా గొప్ప జవాబు ఇచ్చావు. అది వంటింట్లో.. ఛపాతీ కర్రతో ఛాలెంజ్ చేశావు. కానీ, వంటింట్లో ఎవరైన ఛపాతీ కర్రతో ఉన్నారంటే.. అది పరోటాలు చేసేందుకే కదా. చూడు ప్లేట్ ఖాళీగా ఉంది.. పచ్చడి.. పెరుగు అన్ని ఉన్నాయి. పరాఠాలు పంపించు మరీ’’ అంటూ సచిన్ వీడియో పోస్ట్ చేశారు. దీనిపై యువీ కూడా స్పందించాడు. ‘అదే పనిలో ఉన్నాను’ అంటూ యువరాజ్ ఈ వీడియోపై రిప్లే ఇచ్చాడు.