సాగర్ ఆయకట్టులో..వారబందీ నిలిపివేత
ABN , First Publish Date - 2021-03-01T05:34:27+05:30 IST
నాగార్జున సాగర్ కుడికాలువ ఆయకట్టులో వారబందీ విధానాన్ని జలవనరుల శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.
15 వరకు నిరంతరం సాగునీటి సరఫరా
నరసరావుపేట, ఫిబ్రవరి 28: నాగార్జున సాగర్ కుడికాలువ ఆయకట్టులో వారబందీ విధానాన్ని జలవనరుల శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. 15 వరకు నిరంతరంగా సాగునీటి ఉంటుందని కెనాల్స్ ఎస్సీ గంగరాజు పురుషోత్తంరాజు అదివారం తెలిపారు. మార్చి 31 వరకు సాగుకు నీటి సరఫరా జరగనుంది. అయకట్టులోని వివిధ ప్రాంతాల్లో రెండో పంట కింద రైతులు విస్తృతంగా వరి సాగును చేశారు. 60వేల ఎకరాలలో పైగా వరి సాగు చేసినట్టు అంచనాగా ఉంది. మార్చి నెలాఖరు వరకే సాగు నీరు సరఫరా ఉంటుందని జలవనరుల శాఖ వారబందీ షెడ్యూలును ప్రకటించిన విషయం విదితమే. దీనిని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు ఎస్సీ తెలి పారు. 16 నుంచి వారబందీ అమలు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జలవనురల శాఖ తాజా ప్రకటనతో ఆయకట్టు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ఆదివారం 551.60 అడుగుల నీటి నిల్వ ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా డ్యామ్లో 213.32 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. శ్రీశైలం జలాశయంలో 885 అడుగులు పూర్తిస్థాయి నీటి మట్టం కాగా 856.70 అడుగుల నీటి నిల్వలు ఉన్నాయి. నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా డ్యామ్లో 96.50 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.