సాయి, దేవరాజ్‌లను ఎదురెదురుగా కూర్చొబెట్టి విచారించనున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-09-11T23:32:31+05:30 IST

సాయి, దేవరాజ్‌లను ఎదురెదురుగా కూర్చొబెట్టి విచారించనున్న పోలీసులు

సాయి, దేవరాజ్‌లను ఎదురెదురుగా కూర్చొబెట్టి విచారించనున్న పోలీసులు

హైదరాబాద్: సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. శ్రావణి ఆత్మహత్య కేసులో చిక్కుముడులను విప్పేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలు రాబట్టేందుకు విచారణను వేగవంతం చేస్తున్నారు. పలు కోణాల్లో పోలీసులు శ్రావణీ కేసును విచారిస్తున్నారు. ఇప్పటికే దేవరాజ్‌ను పోలీసులు విచారించారు. శనివారం ఎస్సార్‌ నగర్‌ పోలీసుల ఎదుట విచారణకు సాయికృష్ణారెడ్డి హాజరుకానున్నారు. ప్రేమ పేరిట దేవరాజ్‌ రెడ్డి వేధింపులే శ్రావణి ఆత్మహత్యకు కారణమని సాయి ఆరోపిస్తుండగా, సాయి వేధింపుల వల్లే మృతిచెందిందని దేవరాజ్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇందుకు తమ తమకు అనుకూలంగా ఉన్న ఫోన్‌ రికార్డులను ఇద్దరూ బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే సాయికృష్ణారెడ్డి, దేవరాజ్‌లను ఎదురెదురుగా కూర్చొబెట్టి పోలీసులు విచారించనున్నారు. శ్రావణిని దేవరాజ్‌ బెదిరించిన ఆడియోలు.. శ్రావణిని సాయి కొట్టినట్లు బయటికి వచ్చిన ఆడియోలపై  పోలీసులు ప్రశ్నించనున్నారు. 


అయితే ఈ కేసులో మూడో వ్యక్తి పేరు తెరమీదకు వచ్చింది. ఆర్‌ఎక్స్ 100 చిత్ర నిర్మాత అశోక్‌రెడ్డితో శ్రావణి మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో సంభాషణ ఒకటి నెట్‌లో వైరల్‌గా మారింది. ఫోన్‌లో మాటలను బట్టి చూస్తే శ్రావణితో అశోక్‌రెడ్డికి దగ్గరి పరిచయం ఉన్నట్లు అర్థమవుతోందనే అభిప్రాయాలు వ్యకమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సాయి, దేవరాజ్‌తో పాటు అశోక్‌రెడ్డిని కూడా విచారించనున్నారు. శ్రావణి కుటుంబ సభ్యుల నుంచి మరోసారి స్టేట్‌మెంట్ పోలీసులు రికార్డు చేయనున్నారు. శ్రీకన్య రెస్టారెంట్‌లో శ్రావణిని సాయి కొట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఫుటేజ్‌లో కొట్టినట్టు ఆధారాలు లభిస్తే సాయికృష్ణపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. శ్రావణి ఆత్యహత్యకు సాయితో పాటు అశోక్‌రెడ్డి కూడా కారణమని దేవరాజ్‌  ఆరోపిస్తున్నాడు. కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌రెడ్డి గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Updated Date - 2020-09-11T23:32:31+05:30 IST