వీళ్లకు దారి లేదు
ABN , First Publish Date - 2021-05-29T08:53:04+05:30 IST
స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలు పూర్తిగా అడుగంటాయి.
ఒలింపిక్స్ నుంచి సైనా, శ్రీకాంత్ అవుట్
న్యూఢిల్లీ: స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలు పూర్తిగా అడుగంటాయి. ప్రస్తుత ర్యాంకింగ్స్ జాబితాలో సవరణలు చేయబోమని, క్వాలిఫికేషన్ గడువు ముగిసేలోపు మరే టోర్నీ నిర్వహించబోమని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) శుక్రవారం స్పష్టంజేసింది. వాస్తవంగా..కరోనాతో ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ చివరి టోర్నమెంట్ సింగపూర్ ఓపెన్ రద్దు కావడంతోనే ప్రపంచ మాజీ నెంబర్ వన్ శ్రీకాంత్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత నెహ్వాల్ టోక్యో అవకాశాలు దాదాపు అడుగంటాయి. కానీ టోక్యో ఒలింపిక్స్ అర్హతకు సంబంధించి త్వరలో మరో ప్రకటన చేస్తామని గతంలో బీడబ్ల్యూఎఫ్ చెప్పడంతో భారత షట్లర్లలో ఆశలు మిగిలాయి. కానీ తాజా ప్రకటనతో సైనా, శ్రీకాంత్ పూర్తిగా డీలాపడ్డారు. ఇక టోక్యో క్రీడల బాడ్మింటన్ సింగిల్స్లో పీవీ సింధు, సాయిప్రణీత్, పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ భారత్ తరపున బరిలో దిగనున్నారు.