రాహుల్ గాంధీపై సాక్షి మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-01-21T05:26:03+05:30 IST

బీజేపీ సీనియర్ నేత, ఉన్నావ్ ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ‘‘పిచ్చోడు’’ అంటూ ...

రాహుల్ గాంధీపై సాక్షి మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

లక్నో: బీజేపీ సీనియర్ నేత, ఉన్నావ్ ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ‘‘పిచ్చోడు’’ అంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విష్ణుగంజ్‌లో ఇవాళ జరిగిన ఓ మీడియా సమావేశం సందర్భంగా సాక్షి మహరాజ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. నూతన వ్యవసాయ చట్టాలపై రాహుల్ వైఖరిపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ... ‘‘రాజకీయాల్లో కనీసం ఏబీసీడీలు కూడా రాని ఓ పిచ్చి వ్యక్తి గురించి నేనేం చెప్పేది...’’ అని పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న వాళ్లు అసలు రైతులే కాదంటూ ఆయన చెప్పుకొచ్చారు. ‘‘ఆందోళన చేస్తున్న వాళ్లు రైతులు కాదు. రైతులు మోదీకి వ్యతిరేకంగా మాట్లాడరు. రైతుల ఆందోళన ముసుగులో... ట్రిపుల్ తలాక్ చట్టానికి, ఆర్టికల్ 370 రద్దుకు, రామాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా ఈ ఆందోళన జరుగుతోంది...’’ అని సాక్షి మహరాజ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ‘‘బుజ్జగింపు’’ రాజకీయాలకు తెరలేపిందంటూ ఆయన విమర్శించారు. 

Updated Date - 2021-01-21T05:26:03+05:30 IST