ఐపీఓ ఇన్వెస్టర్లకు అమ్మకాల పోటు!
ABN , First Publish Date - 2022-01-27T07:30:12+05:30 IST
గత ఏడాది రికార్డు సంఖ్యలో కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. వాటిలో చాలా కంపెనీల ఇష్యూలతోపాటు స్టాక్ మార్కెట్లో
గత ఏడాది నమోదైన కంపెనీల్లో ప్రతి మూడింటిలో ఒకటి లిస్టింగ్ ధర దిగువకు
ముంబై: గత ఏడాది రికార్డు సంఖ్యలో కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. వాటిలో చాలా కంపెనీల ఇష్యూలతోపాటు స్టాక్ మార్కెట్లో వాటి షేర్ల లిస్టింగ్కూ ఇన్వెస్టర్ల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈక్విటీ మార్కెట్ల జోరు, రిటైల్ మదుపరుల ఆసక్తి పెరగడం ఇందుకు దోహదపడింది. అయితే, ఈ ఏడాది మార్కెట్లు బేర్ మలుపు తీసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల్లో అమ్మకాలు పోటెత్తడంతో గడిచిన కొన్ని వారాల్లో మన మార్కెట్లూ భారీగా పతనమవుతూ వచ్చాయి. దాంతో, 2021లో నమోదైన ప్రతి మూడింటిలో ఒక కంపెనీ షేరు లిస్టింగ్ ధర కంటే దిగువన ట్రేడవుతోంది. పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్, నైకా పోర్టల్ నిర్వహణదారు ఎఫ్ఎ్సఎన్ ఈ-కామర్స్ వెంచర్స్, జొమాటో, పాలసీబజార్ పోర్టల్ నిర్వహణ కంపెనీ పీబీ ఫిన్టెక్, కార్ట్రేడ్ వంటి ఆధునిక టెక్నాలజీ కంపెనీలతోపాటు స్టార్ హెల్త్ షేర్లైతే, లిస్టింగ్ ధరతో పోలిస్తే భారీగా క్షీణించాయి. దాంతో ఆ ఆరు కంపెనీల మార్కెట్ విలువ సోమవారం నాటికి రూ.1.2 లక్షల కోట్లకు పైగా క్షీణించింది. గత సంవత్సరం లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో రూ.2 లక్షల కోట్లు ఆవిరయింది. బ్లూంబర్గ్ డేటా ప్రకారం.. బీఎ్సఈ ఐపీఓ ఇండెక్స్ ఈ ఏడాదిలోనే 10 శాతం వరకు క్షీణించింది. పబ్లిక్ ఆఫరింగ్ అనంతరం మార్కెట్లో లిస్టయ్యాక రెండేళ్ల వరకు కంపెనీ షేర్ల పనితీరును గమనించేందుకు ఈ సూచీని ఏర్పాటు చేశారు. గత ఏడాది 63 కంపెనీలు ఐపీఓల ద్వారా మొత్తం రూ.1.2 లక్షల కోట్లు సమీకరించాయి. పబ్లిక్ ఇష్యూల ద్వారా ఏడాదికాలంలో సేకరించిన నిధుల్లో ఇదే అతిపెద్ద మొత్తం.