ఆత్మ విశ్వాసానికి గుర్తు ఉప్పు : మోదీ

ABN , First Publish Date - 2021-03-12T20:43:08+05:30 IST

భారత దేశ ఆత్మ విశ్వాసానికి గుర్తు ఉప్పు అని, మిగతా విలువలతోపాటు

ఆత్మ విశ్వాసానికి గుర్తు ఉప్పు : మోదీ

అహ్మదాబాద్ : భారత దేశ ఆత్మ విశ్వాసానికి గుర్తు ఉప్పు అని, మిగతా విలువలతోపాటు ఈ ఆత్మవిశ్వాసాన్ని కూడా బ్రిటిషర్లు దెబ్బతీశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారతీయులు ఇంగ్లండ్ నుంచి వచ్చే ఉప్పుపై ఆధారపడవలసి వచ్చేదని, ఆ సమయంలో మహాత్మా గాంధీ భారతీయుల పరిస్థితిని అర్థం చేసుకున్నారని చెప్పారు. ప్రజల నాడిని తెలుసుకుని ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారని, ఆ ఉద్యమం ప్రతి భారతీయుడి ఉద్యమంగా మారిందని తెలిపారు. ప్రతి భారతీయుడు దృఢ నిశ్చయంతో ఉద్యమించాడని తెలిపారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 


మన దేశం వచ్చే సంవత్సరం 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటుంది. 2022 ఆగస్టు 15 రావడానికి మరొక 75 వారాల సమయం ఉంది. మహాత్మా గాంధీ దండి యాత్ర 91వ వార్షికోత్సవాల సందర్భంగా మార్చి 12న (శుక్రవారం) ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను మోదీ ప్రారంభించారు. ఈ ఉత్సవాలను 2023 ఆగస్టు 15 వరకు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 75 కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


సబర్మతి ఆశ్రమంలో...

1930 మార్చి 12న మహాత్మా గాంధీ నేతృత్వంలో 80 మంది 24 రోజులపాటు దండి యాత్ర నిర్వహించారు. బ్రిటిష్ పాలకుల ఆదేశాలను ధిక్కరించి దండిలో ఉప్పును తయారు చేశారు. దీనినే ఉప్పు సత్యాగ్రహం అని కూడా అంటారు. ఇది అహింసా పద్ధతుల్లో జరిగిన నిరసన కార్యక్రమం. మోదీ శుక్రవారం ప్రారంభించిన దండి యాత్ర అహ్మదాబాద్ నుంచి నవసరి జిల్లాలోని దండి వరకు జరుగుతుంది. సబర్మతి ఆశ్రమం నుంచి ఈ యాత్రను జెండా ఊపి మోదీ ప్రారంభించారు. ఉప్పు సత్యాగ్రహం జరిగిన మార్గంలోనే, 386 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర జరుగుతుంది. 81 మంది పాల్గొంటున్న ఈ యాత్ర దండిలో ఏప్రిల్ 6న ముగుస్తుంది. మొదటి 75 కిలోమీటర్ల యాత్రకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ నాయకత్వం వహిస్తారు. 


భారతీయుల స్వయంకృషి

అహ్మదాబాద్‌లో దండి యాత్రను ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సంగ్రామంలోనూ, ఆ తర్వాత సాధించిన విజయాలను ప్రపంచం ముందు ఉంచుతామన్నారు. స్వాతంత్ర్య సంగ్రామం గురించి స్పష్టంగా వివరించాలని అన్ని రంగాలవారినీ కోరారు. భారతీయులు స్వదేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా తమ కఠోర శ్రమతో తమను తాము నిరూపించుకున్నారని చెప్పారు. మన రాజ్యాంగం, ప్రజాస్వామిక సంప్రదాయాలు మనకు గర్వకారణమని తెలిపారు. భారత దేశాన్ని ప్రజాస్వామ్యానికి తల్లిగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటూ భారత దేశం ముందుకు సాగుతోందని చెప్పారు. నేటికీ మన విజయాలు కేవలం మనకే సొంతం కాదని, యావత్తు ప్రపంచానికి దారి చూపుతున్నామని చెప్పారు. యావత్తు మానవాళిలో ఆశావాదాన్ని ప్రేరేపిస్తున్నామని తెలిపారు. స్వయం సమృద్ధి నిండిన మన అభివృద్ధి యావత్తు ప్రపంచ అభివృద్ధిని వేగవంతం చేస్తుందన్నారు. 


Updated Date - 2021-03-12T20:43:08+05:30 IST