నగరడోన రిజర్వాయర్కు మోక్షం
ABN , First Publish Date - 2021-06-24T04:57:35+05:30 IST
చిప్పగిరి మండలం నగరడోన రిజర్వాయర్ నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది.
రూ.58 కోట్లు మంజూరు
ఆలూరు, జూన్ 23: చిప్పగిరి మండలం నగరడోన రిజర్వాయర్ నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. 13 ఏళ్ల తర్వాత నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలుపుతూ రూ.58 కోట్లు మంజూరు చేశారు. హెచ్ఎల్సీ చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు ఆలూరు బ్రాంచ్ కెనాల్ కాలువపై నగరడోన రిజర్వాయర్ను నిర్మించేందుకు 711 ఎకరాలను సేకరించారు.
భూసేకరణ పూర్తి..
రిజర్వాయర్ నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతులకు రూ.1.50 లక్షల చొప్పున రూ.10 కోట్లు అప్పట్లోనే చెల్లించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి మారెప్ప ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే నిర్మాణ పనులు జరగక పోగా శిలాఫలకానికే పరిమితమైంది. కాంట్రాక్టర్ రాజకీయ నాయలకు పర్సంటేజీలు ఇవ్వలేక పనులు చేపట్టలేదు. దీంతో నగరడోన రిజార్వయర్ మరుగునపడిపోయింది.
రిజర్వాయర్ నిర్మాణానికి సీఎం ఆమోదం..
నగరడోన రిజర్వాయర్ను నిర్మించేందుకు సీఎం రూ.58 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి గుమ్మనూరు జయరామ్ తెలిపారు. రిజర్వాయర్ నిర్మాణం జరిగితే 4,200 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందనుంది. చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలాల్లో పలు గ్రామాలకు సాగునీరందే అవకాశాలు ఉన్నాయి.