Votersను ఆకర్షించేందుకు అఖిలేశ్ వినూత్న ఎత్తుగడ
ABN , First Publish Date - 2021-11-10T00:05:47+05:30 IST
రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఓటర్లను
లక్నో : రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అత్తరును విడుదల చేశారు. 2022లో ఈ సెంటు అద్భుతాలు సృష్టిస్తుందని చెప్పారు. 22 సహజసిద్ధ సుగంధాలతో తయారు చేసిన దీనికి ‘సమాజ్వాదీ అత్తరు’ అని పేరు పెట్టారు. దీనిని ఎరుపు, ఆకుపచ్చ రంగులు కలిసిన గాజు సీసాలలో ఉంచి, పైన సైకిలు గుర్తును ముద్రించారు. దీని కవరుపై అఖిలేశ్ బొమ్మ కూడా ఉంది.
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు 2022 ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరిగే అవకాశం ఉంది. సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ మాట్లాడుతూ, సమాజ్వాదీ అత్తరును వాడినవారు దానిలోని సామ్యవాదాన్ని వాసన చూస్తారని చెప్పారు. ఈ అత్తరు 2022లో విద్వేషాన్ని తుదముట్టిస్తుందన్నారు.
అఖిలేశ్ యాదవ్ పెర్ఫ్యూమ్స్ను విడుదల చేయడం ఇదే మొదటిసారి కాదు. 2016లో ఆయన ప్రభుత్వం నాలుగేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రకరకాల సెంట్లను విడుదల చేశారు.