చైనాకు శాం‌సంగ్ ఝలక్!

ABN , First Publish Date - 2020-08-01T23:58:47+05:30 IST

బహుళ జాతి కంపెనీలన్నీ చైనాలో తమ దుకాణాన్ని మూసేసుకుంటున్నాయి. పెట్టబేడా సర్దుకుని జంపైపోతున్నాయి. తాజాగా.. శాం‌సంగ్ చైనాలోని తన చివరి కంప్యూటర్ తయారీ యూనిట్‌లో పనులను నిలిపి వేసింది.

చైనాకు శాం‌సంగ్ ఝలక్!

బీజింగ్: బహుళ జాతి కంపెనీలన్నీ చైనాలో తమ దుకాణాల్ని మూసేసుకుంటున్నాయి. పెట్టేబేడా సర్దుకుని జంపైపోతున్నాయి. శాం‌సంగ్ తాజాగా చైనాలోని తన చివరి కంప్యూటర్ తయారీ యూనిట్‌లో పనులను నిలిపి వేసింది. అక్కడ పనిచేస్తున్న 1700 మంది కార్మికులకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. దీంతో వారి భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే పరిశోధన అభివృద్ధి విభాగానికి చెందిన ఉద్యోగులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని సమాచారం. 


2012లో ఈ కర్మాగారం నుంచి దాదాపు 4.3 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతయ్యాయి. కానీ 2018 నాటికి ఇక్కడి నుంచి ఎగుమతైన వస్తువుల విలువ బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయితే ఈ కర్మాగారంలోని ఉత్పత్తి, ఆదాయం, ఉద్యోగులకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించేందుకు శాం‌సంగ్ ప్రతినిధి నిరాకరించారు. చైనా మార్కెట్‌కు తాము అత్యంత ప్రాధాన్యమిస్తామని, అక్కడి వినియోగదారులకు మంచి నాణ్యతతో కూడిన ఉత్పత్తులు అందించడమే తమ లక్ష్యమని శామ్‌సంగ్ ఓ ప్రకటనలో తెలిపింది.


ఇక శాం‌సంగ్ గతేడాదే..చైనాలో తమ చివరి స్మార్ట్ ఫోన్ తయారీ కేంద్రాన్ని మూసేసింది. ప్రస్తుతం సదరు సంస్థకు చైనాలో కేవలం రెండు సెమికండక్టర్ ఉత్పత్తుల తయారీ యూనిట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా.. ఇటీవల అనేక బహుళ జాతి కంపెనీ తమ తయారీ కేంద్రాలను చైనా నుంచి తరలించేస్తున్న విషయం తెలసిందే. చైనాలో పెరుగుతున్న లేబర్ ఖర్చులతో పాటు కరోనా సంక్షోభం, అమెరికాతో నెలకొన్న వాణిజ్యం యుద్ధం వంటివన్నీ కంపెనీలు చైనా నుంచి తరలిపోయేలా చేస్తున్నాయి. 

  

Updated Date - 2020-08-01T23:58:47+05:30 IST