బావుసాయిపేటలో ఇసుక వివాదం
ABN , First Publish Date - 2021-06-22T06:36:18+05:30 IST
కోనరావుపేట మండలం బావుసాయి పేట గ్రామంలో ఇసుక వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇసుక లోడ్ చేయడానికి కూలీ కోసం వెళ్లిన దళితుడు బొడ్డు భూమయ్యపై గ్రామ సర్పంచ్ కెంద గంగాధర్, మాజీ ఎంపీటీసీ చిగుర్ల దేవయ్య దాడి చేయడంతో దళితులు ఆగ్రహానికి గురయ్యారు. న్యాయం చేయాలని గ్రామ పంచాయతీ ఎదుట బైఠాయించారు. దళితుడిపై దాడి చేసిన మాజీ ఎంపీటీసీ చిగుర్ల దేవయ్య ఇంటిపై దళిత మహిళలు దాడికి యత్నించడంతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
- దళితుడిపై దాడి చేసిన సర్పంచ్, మాజీ ఎంపీటీసీ
- న్యాయం చేయాలని జీపీ ఎదుట బైఠాయించిన దళితులు
- గ్రామంలో ఉద్రిక్తత, అదుపులోకి తెచ్చిన పోలీసులు
కోనరావుపేట, జూన్ 21: కోనరావుపేట మండలం బావుసాయి పేట గ్రామంలో ఇసుక వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇసుక లోడ్ చేయడానికి కూలీ కోసం వెళ్లిన దళితుడు బొడ్డు భూమయ్యపై గ్రామ సర్పంచ్ కెంద గంగాధర్, మాజీ ఎంపీటీసీ చిగుర్ల దేవయ్య దాడి చేయడంతో దళితులు ఆగ్రహానికి గురయ్యారు. న్యాయం చేయాలని గ్రామ పంచాయతీ ఎదుట బైఠాయించారు. దళితుడిపై దాడి చేసిన మాజీ ఎంపీటీసీ చిగుర్ల దేవయ్య ఇంటిపై దళిత మహిళలు దాడికి యత్నించడంతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. కోనరావుపేట ఎస్సై రాజశేఖర్ వివరాల ప్రకారం.. బావుసాయిపేట గ్రామంలోని మూలవాగు నుంచి ఆదివారం రాత్రి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కూలీలు ఇసుకను ట్రాక్టర్లలో లోడ్ చేసేందుకు వెళ్లారు. ఇసుక తరలిస్తున్నారని సమాచారం తెలుసుకున్న సర్పంచ్ కెంద గంగాధర్, మాజీ ఎంపీటీసీ చిగుర్ల దేవయ్య మరికొందరు వాగు వద్దకు వెళ్లారు. గమనించిన కూలీలు పరుగుతీశారు. బొడ్డు భూమయ్య అనే దళితుడు మాత్రం మోకాళ్ల నొప్పులు ఉండడంతో అక్కడే కూర్చున్నాడు. సర్పంచ్ గంగాధర్, ఎంపీటీసీ చిగుర్ల దేవయ్య కులం పేరుతో దూషిస్తూ పారలతో భూమయ్యపై దాడి చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ తిక్కల ప్రదీప్ను కూడా కొట్టారు. ఈ క్రమంలో బొడ్డు భూమ య్య వారి నుంచి తప్పించుకున్నాడు. విషయం తెలు సుకున్న దళితులు సోమవారం ఉదయం పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. సర్పంచ్ గంగాధర్, మాజీ ఎంపీటీసీ దేవయ్య గ్రామ పంచాయతీకి వద్దకు రావాలని డిమాండ్ చేశారు. సుమారు వంద మంది దళితులు ఆందోళనకు దిగారు. కొంత మంది మహిళలు చిగుర్ల దేవయ్య ఇంటిపై దాడికి యత్నించారు. కోనరావుపేట ఎస్సై రాజశేఖర్ గ్రామంలోకి చేరుకొని దళితులతో మాట్లాడారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో దళి తులు ఆందోళన విరమించారు. బొడ్డు భూమయ్య ఫిర్యాదుతో సంఘటనకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఎవరినీ కొట్టలేదు
బావుసాయిపేట మూలవాగు నుంచి రాత్రి పూట నాలుగు ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని కొంత మంది రైతులు చెప్పడంతో అక్కడికి వెళ్లాం తప్ప ఎవరినీ కొట్టలేదని బావుసాయిపేట సర్పంచ్ గంగాధర్ తెలిపారు. రైతులతో కలిసి వెళ్తుండగా ఇసుక లోడింగ్కు వచ్చిన కూలీలు పరిగెత్తారని, ఆ క్రమంలోనే పడడంతో దెబ్బలు తాకాయని అన్నారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తుండగా అడ్డుకోవడానికి వెళ్లిన రైతులపై డ్రైవర్ ట్రాక్టర్ ఎక్కించే ప్రయత్నం చేశాడని, రైతులు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చారని వివరించారు.