ఇసుక తవ్వకాలు షురూ
ABN , First Publish Date - 2021-05-15T09:48:47+05:30 IST
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు, సరఫరా ప్రక్రియ మొత్తం కాంట్రాక్టు సంస్థ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ అధీనంలోకి వచ్చేసింది.
- జొన్నాడ రీచ్లో ముహూర్తం ప్రకారం
- ప్రారంభించిన జేపీ పవర్.. ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి
అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు, సరఫరా ప్రక్రియ మొత్తం కాంట్రాక్టు సంస్థ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ అధీనంలోకి వచ్చేసింది. తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ రీచ్లో సదరు సంస్థ శుక్రవారం ఈ తవ్వకాలను ముహుర్తం ప్రకారం లాంఛ నంగా ప్రారంభించింది. జేపీ పవర్కు ఇసుక తవ్వకాలను అప్పగిస్తున్నారని, శుక్రవారం నాడు ఆ సంస్థ తూర్పుగోదావరి జిల్లాలో లాంఛనంగా ఇసుక తవ్వకాలు ప్రారంభించనుందని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారమే సదరు సంస్థ తవ్వకాలను లాంఛనంగా ప్రారంభించింది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు నడుస్తున్న రీచ్లను ఆపేశారు. అక్కడ తవ్వకాలు, సరఫరా, బుకింగ్లను కూడా నిలిపేశారు. ఇక ఏపీఎండీసీ నుంచి జేపీ పవర్కు రీచ్లన్నీ బదలాయింపు అయినట్లే. మరోవైపు ఏపీఎండీసీ ఇప్పటివరకు పలువురు ప్రైవేటు ఆపరేటర్లకు రవాణా కాంట్రాక్టు ఇచ్చింది. అయితే అవన్నీ ఇప్పుడు నిలిపివేసింది.