మరో 2 నెలలు పాత విధానంలోనే ఇసుక
ABN , First Publish Date - 2021-01-17T09:00:15+05:30 IST
రాష్ట్రంలో ఇసుక సరఫరాకు సంబంధించి మరో రెండునెలల పాటు పాత విఽధానాన్నే అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
టెండర్లు ఫైనల్ చేశాకే కొత్త విధానం అమలు
అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇసుక సరఫరాకు సంబంధించి మరో రెండునెలల పాటు పాత విఽధానాన్నే అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీఎండీసీ ఆధ్వర్యంలోనే ఇసుక తవ్వకం, రవాణా, అమ్మకాలు జరగనున్నాయి. నూతన విధానం తీసుకొచ్చి వేలం ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా.. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి రెండునెలలు పడుతుందని తెలిసింది. దీంతో ఈ రెండునెలల పాటు ప్రస్తుతం ఉన్న పాత విధానంలోనే ఇసుక అమ్మకాలు జరగనున్నాయి. వేలం విధానంలో ఇసుకను విక్రయించేందుకు రాష్ట్రం మొత్తాన్ని మూడు జోన్లుగా విభజించారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లా ఒక జోన్గా, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం మరో జోన్గా, నెల్లూరు, రాయలసీమ జిల్లాలను మరో జోన్గా విభజించారు. ఆయా జోన్లవారీగా ఇసుక వేలానికి టెండర్లను పిలిచారు. ఆయా జోన్లలోని మొత్తం రీచ్లలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలను ఒకే టెండర్దారుకు అప్పగిస్తారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎ్సటీసీ ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ టెండర్లు పిలిచింది.