ప్రభుత్వ అనుమతుల పేరిట ఇసుక తరలింపు
ABN , First Publish Date - 2021-12-02T05:19:35+05:30 IST
ప్రభుత్వ అనుమతుల పేరిట ఇసుక తరలింపు
తాండూరు రూరల్: ప్రభుత్వ నిర్మాణాల పేరిట కొందరు ఇసుకను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక అనుమతులు ఇచ్చే రెవెన్యూ అధికారులు, పోలీసులు మామూళ్ల మత్తులో పర్యవేక్షణలేక ఇసుక వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. తాండూరులోని ప్రభుత్వ భవనాల నిర్మాణం పేరిట కొంతమంది వ్యాపారులు అనుమతుల పేరిట ఇసుకను డంప్ చేస్తున్నారు. ఈ విషయంపై అటు రెవెన్యూ అధికారులు, ఇటు పోలీసులు పట్టించుకోవడం లేదు. ఎక్కడికక్కడ ప్రైవేట్గా డంప్ చేస్తున్నారు. తద్వారా మైనింగ్ కింద ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. వ్యాపారులు అనుమతి ఒక చోటు తీసుకొని మరో చోట ఇసుక డంప్ చేస్తున్నారు. బుధవారం పాత తాండూరు నుంచి ఇసుకను తీసుకువస్తున్న ట్రాక్టర్(ఏపీ28 ఏఎల్9715)ను డ్రైవర్ రాజీవ్ గృహకల్ప వద్ద ఆస్పత్రి నిర్మాణానికి ఇసుక ట్రాక్టర్ను కోకట్ రూట్లోని తహసీల్దార్ కార్యాలయం మీదుగా వెళ్తుండగా కొందరు ఫొటోలు తీశారు. వెంటనే వెనుదిరిగి ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్లి సీసీ రోడ్డు నిర్మాణానికి అనుమతులున్నాయని వెంకటపద్మావతి ఆసుపత్రి వద్ద మూడు ట్రిప్పుల ఇసుకను డంప్ చేశారు. ఈ విషయంపై డిప్యుటీ తహసీల్దార్ ధనంజయను వివరణ కోరగా, రెండు ట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఇదే అదునుగా మరికొన్ని ట్రాక్టర్లు కూడా అక్రమ ఇసుకను తరలించి విక్రయిస్తున్నారు. ప్రతిరోజూ రాత్రింబవళ్లు ఇసుకను తరలిస్తున్నారని పాత తాండూరు వాసులు పేర్కొంటున్నారు.