రైతులను శాసించడానికి కలెక్టర్ ఎవరు?
ABN , First Publish Date - 2021-10-27T08:37:17+05:30 IST
రైతులను శాసించడానికి కలెక్టర్ ఎవరని, ఏ పంట వేసుకోవాలో ఆయనెలా చెబుతారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. వెంకట్రామారెడ్డి జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉండి న్యాయవ్యవస్థ
- ఏ పంట వేయాలో ఆయనెలా చెబుతారు?
- సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్న వెంకట్రామారెడ్డి
- భూములను కబ్జా చేసినట్లు అనుకుంటున్నావా?
- తప్పును ఒప్పుకోవాలి.. రైతులకు క్షమాపణ చెప్పాలి
- సిద్దిపేట జిల్లా కలెక్టర్పై నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రైతులను శాసించడానికి కలెక్టర్ ఎవరని, ఏ పంట వేసుకోవాలో ఆయనెలా చెబుతారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. వెంకట్రామారెడ్డి జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉండి న్యాయవ్యవస్థ ఇచ్చిన ఆదేశాలను కూడా ధిక్కరిస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కలెక్టరే ధిక్కరిస్తే సామాన్య ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలన్నారు. మంగళవారం గాంధీభవన్లో జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ రైతు తనకు నచ్చిన పంట వేయకూడదా వెంకట్రామిరెడ్డీ? సిద్దిపేట జిల్లాలో ఏ పంట వేయాలనేది కలెక్టర్ నిర్ణయిస్తాడా? ఏ అధికారంతో మీరు బెదిరింపులకు దిగుతున్నారు? కొల్లూరు, తెల్లాపూర్, కోకాపేటలో భూములు కబ్జా చేసిన్నట్లు అనుకున్నవా?’’ అని మండిపడ్డారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రైతులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ తరఫున పోరాటం చేస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు. వరి విత్తనాల అమ్మకంపై సోమవారం కలెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, మంగళవారం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని, నెపాన్ని మీడియాపై నెట్టివేసేలా ఉందని అన్నారు. కలెక్టర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ తప్పును ఒప్పుకోవాలని, రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.