సంఘ్ కనుసన్నల్లో ఇక ‘సీఎం పేషీ’
ABN , First Publish Date - 2021-08-04T17:46:35+05:30 IST
సచివాలయంలోనూ, ముఖ్యమంత్రి అధికార నివాసంలోనూ అన్ని కీలక పోస్టులు ఇక సంఘ్పరివార్ కనుసన్నల్లో పనిచేయనున్నాయి. ప్రతిపక్షాలకు ఎలాంటి కీలక సమాచారం లీక్ కాకుం
- అధిష్ఠానం సూచన మేరకు కీలక పోస్టుల్లో నియామకాలు
బెంగళూరు: సచివాలయంలోనూ, ముఖ్యమంత్రి అధికార నివాసంలోనూ అన్ని కీలక పోస్టులు ఇక సంఘ్పరివార్ కనుసన్నల్లో పనిచేయనున్నాయి. ప్రతిపక్షాలకు ఎలాంటి కీలక సమాచారం లీక్ కాకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం పదవి నుంచి యడియూరప్ప నిష్క్రమించిన 24 గంటల వ్యవధిలోనే సీఎం పేషీలోని 15 మంది అధికారులను, నలుగురు ఔట్సోర్సింగ్ సిబ్బందిని రిలీవ్ చేశారు. రిలీవ్ అయిన వారిలో 12 మంది కేఏఎస్ అధికారులు కూడా ఉండటం గమనార్హం. ఇంకా సీఎం సచివాలయం, అధికార నివాసం పేషీలో 100 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. వీరిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరిలో ఎంతమందిని కొనసాగించాలి? ఎంతమందిని తొలగించాలి అనే అంశంపై సంఘ్పరివార్ ముఖ్యనేతలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి తన పేషీలో కీలకమైన పోస్టులకు ఎవరిని నియమించుకోవాలనేది పూర్తిగా సీఎం అభీష్టం. అయితే ఇందుకు భిన్నంగా సంఘ్పరివార్కు ఇష్టమైన అధికారులకే కీలకమైన పోస్టులను కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మంత్రుల పేషీల్లోనూ సిబ్బంది నియామకాల్లో సంఘ్ ముద్ర ఉంటుందని అంటున్నారు. సీఎం పేషీలో తొలిసారి గోవధనిషేధ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం పేషీపై పట్టుకోసం సంఘ్ పరివార్ బీజేపీ అధిష్ఠానం ద్వారా ప్రయత్నిస్తోందని, ఇందుకు బీజేపీ జా తీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహకారం కూడా పుష్కలంగా లభిస్తోందని అంటున్నారు. అయితే ఈ కథనాలను సంఘ్పరివార్ తోసిపుచ్చింది. పాలనా వ్యవహారాల్లో తమ జోక్యం ఉండబోదని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి అవసరమైన సమయాల్లో సంఘ్ పరివార్ మార్గదర్శకత్వం మాత్రమే వహిస్తుందని తేల్చిచెప్పింది.