తొందరపడ్డానేమో.. చింతిస్తున్నా!
ABN , First Publish Date - 2022-01-26T09:17:06+05:30 IST
తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఎంతో ముందుగానే వెల్లడించడంపై చింతిస్తున్నానని భారత టెన్నిస్ వెటరన్ సానియా మీర్జా చెప్పింది.
మెల్బోర్న్: తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఎంతో ముందుగానే వెల్లడించడంపై చింతిస్తున్నానని భారత టెన్నిస్ వెటరన్ సానియా మీర్జా చెప్పింది. ఈ సీజన్తో కెరీర్కు వీడ్కోలు పలకనున్నట్టు ఈనెల 19న మీర్జా ప్రకటించింది. అయితే, తాను మ్యాచ్లు ఆడుతున్నా.. తన రిటైర్మెంట్పైనే ఎక్కువగా ప్రశ్నలు ఎదురవుతున్నాయని మిక్స్డ్ మ్యాచ్ అనంతరం సానియా వాపోయింది. ‘ప్రతి మ్యాచ్ గెలవడానికే ప్రయత్నిస్తా. కానీ, రిటైర్మెంట్ ప్రకటన విషయంలో తొందరపడ్డానేమోనని అనిపిస్తోంది. ఆ విషయాన్నే ఎక్కువగా అడుగుతున్నార’ని సానియా చెప్పింది.
సానియా పరాజయం
భారత టెన్నిస్ వెటరన్ సానియా మీర్జా.. ఓటమితో ఆస్ట్రేలియన్ ఓపెన్కు వీడ్కోలు పలికింది. ఈ ఏడాదితో కెరీర్కు గుడ్బై చెప్పనున్నట్టు సానియా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్లో సానియా- రాజీవ్ రామ్ (అమెరికా) జంట 4-6, 6-7(5)తో ఆస్ట్రేలియాకు చెందిన జైమీ ఫోర్టిస్- జాసన్ కుబ్లర్ జంట చేతిలో ఓడింది. సానియా పరాజయంతో ఈ టోర్నీలో భారత్ కథ ముగిసింది.