కరోనా వైరస్పై టెన్నిస్ స్టార్ సానియామీర్జా ఏం చెప్పారంటే...
ABN , First Publish Date - 2020-03-05T14:26:06+05:30 IST
మన దేశంతోపాటు హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో టెన్నిస్ స్టార్, హైదరాబాదీ సానియామీర్జా మొదటిసారి దీనిపై స్పందించారు.....
హైదరాబాద్ : మన దేశంతోపాటు హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో టెన్నిస్ స్టార్, హైదరాబాదీ సానియామీర్జా మొదటిసారి దీనిపై స్పందించారు. చైనా దేశంలోని వూహాన్ నగరంలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న తరుణంలో మన దేశ ప్రజలు దీనిపై అవగాహన పెంచుకొని అందరూ అప్రమత్తంగా ఉండాలని సానియామీర్జా సూచించారు. సానియా మీర్జా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియో విడుదల చేశారు. కరోనా వైరస్ లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలని సానియా మీర్జా విడుదల చేసిన వీడియోలో కోరారు.
కరోనా వైరస్పై సమాచారం కోసం హెల్ప్ లైన్ నంబరు 104 కు కాల్ చేయాలని, ఈ వైరస్ సోకకుండా ముందుజాగ్రత్తగా నిత్యం చేతులు శుభ్రంగా కడుక్కోవాలని కోరారు. కరోనా వైరస్ లక్షణాలుంటే 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో చేరి చికిత్స పొందాలని సానియా సలహా ఇచ్చారు. దేశంలో ఇప్పటివరకు 28 మంది కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 90వేల మందికి పైగా కరోనా వైరస్ సోకగా మృతుల సంఖ్య మూడువేలు దాటింది.