మద్యం కొనే స్థోమత లేక...
ABN , First Publish Date - 2020-06-02T10:55:11+05:30 IST
పెంచిన మద్యం ధరలు కూలీలకు అందుబాటులో లేకుండా పోయాయి. పగలంతా చెమటోడ్చి కష్టపడి సంపాదించిన కూలి డబ్బుతో మద్యాన్ని
శానిటైజరు తాగి తల్లీకొడుకు మృతి
చెన్నూరు, జూన్ 1 : పెంచిన మద్యం ధరలు కూలీలకు అందుబాటులో లేకుండా పోయాయి. పగలంతా చెమటోడ్చి కష్టపడి సంపాదించిన కూలి డబ్బుతో మద్యాన్ని కొనలేక తక్కువ ధరకు దొరికే శానిటైజరును తాగి తల్లీకొడుకు మృతిచెందిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.
మండలకేంద్రమైన చెన్నూరులోని కేవోఆర్ కాలనీకి చెందిన విజయలక్ష్మికి ముగ్గురు కుమారులు. వీరందరూ బేల్దారి పనితో జీవనం సాగించేవారు. లాక్డౌన్ కారణంగా పనుల్లేక వీరు ఇబ్బందులు పడ్డారు. ఇటీవల పనులు మొదలైనా రోజూ ఉండడం లేదు. దీంతో వచ్చిన కూలి డబ్బు కుటుంబ పోషణకే సరిపోయేది కాదు. రోజంతా కష్టపడి పనిచేయడంతో రాత్రి కాసింత మద్యం గొంతులో పడితే నిద్ర వచ్చి తెల్లారేసరికి ఒంటి నొప్పులు తగ్గుతాయని వారి నమ్మకం. ఇటీవల ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచింది. ఽధరలు సైతం పెంచింది. లాక్డౌన్ కారణంగా పరిమిత సంఖ్యలో దుకాణాలు తెరచుకున్నాయి.
మద్యానికి డిమాండ్ పెరిగింది. దీంతో మద్యం అలవాటు మానుకోలేక, కొనేందుకు డబ్బులేక వీరు ఇబ్బంది పడేవారు. శానిటైజర్ తాగితే మత్తు ఉంటుందని అనుకున్న తల్లీకొడుకు విజయలక్ష్మి (52), శ్రీరాం నాయక్ (24) ఆదివారం దాన్ని కొని తాగారు. తాగిన కాసేపటికే స్పృహ తప్పి నోట్లో నురగ రాగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ మేరకు చెన్నూరు ఎస్ఐ పెద్ద ఓబన్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.