నటుడు సోనూ సూద్పై తీవ్రంగా విరుచుకుపడ్డ శివసేన
ABN , First Publish Date - 2020-06-07T20:14:38+05:30 IST
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను స్వస్థలాలకు చేరవేయడంలో మానవత్వం ప్రదర్శించి.. అందరితో శభాష్
ముంబై : లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను స్వస్థలాలకు చేరవేయడంలో మానవత్వం ప్రదర్శించి.. అందరితో శభాష్ అనిపించుకుంటున్న నటుడు సోనూ సూద్పై శివసేన మాత్రం ‘సామ్నా’ వేదికగా తీవ్రంగా విరుచుకుపడింది. ఆయన త్వరలోనే ప్రధాని మోదీని కలిసి... ‘సెలెబ్రిటీ మేనేజర్ ఆఫ్ ముంబై’ గా అయిపోతారని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ‘కొత్త మహాత్ముడు’ ఊడిపడ్డాడని మండిపడ్డారు.
గవర్నర్ కోషియారీ కూడా ‘మహాత్మా సూద్’ అని ప్రశంసించారని గుర్తు చేశారు. లాక్డౌన్ సమయంలో సూద్ లక్షలాది మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించారని, లాక్డౌన్ సమయంలో అన్ని బస్సులను ఎలా అందుబాటులోకి తెచ్చారో ఎవరూ ఆయన్ను ప్రశ్నించలేదని మండిపడ్డారు. లాక్డౌన్ కారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులను రాష్ట్రాల్లోకి అనుమతించలేదని, అలాంటి సమయంలో వారెక్కడికి వెళ్లారో చెప్పాలని రౌత్ నిలదీశారు.
‘సోనూ సూద్ చాలా మంచి నటుడు. ఆయన చేసిన పని చాలా మంచి పని. కానీ దాని వెనుక ఎవరో రాజకీయ దర్శకుడు ఉండే ఉంటాడు’ అని రౌత్ ఆరోపించారు.