బల్యాన్‌జీ.. రైతులకు మద్దతివ్వండి: టికాయత్

ABN , First Publish Date - 2021-09-06T23:17:52+05:30 IST

సాగుచట్టాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా కోరుకుంటే రాజకీయాల్లోకి రావచ్చని, బీజేపీ స్వాగతిస్తుందని..

బల్యాన్‌జీ.. రైతులకు మద్దతివ్వండి: టికాయత్

ఘజియాబాద్: సాగుచట్టాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా కోరుకుంటే రాజకీయాల్లోకి రావచ్చని, బీజేపీ స్వాగతిస్తుందని కేంద్ర మంత్రి, ముజఫర్‌నగర్ ఎంపీ సంజీవ్ బల్యాన్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్ స్పందించారు. ప్రజలు ఓటేసి గెలిపించినందున సంజీవ్ బల్వాన్ రైతులకు మద్దతుగా ముందుకు రావాలన్నారు. సోమవారంనాడిక్కడ మీడియాతో టికాయత్ మాట్లాడుతూ, ప్రజలే ఓటేసి ఆయనను గెలిపించారని, ఆ కారణంగానైనా రైతులకు ఆయన మద్దతు ప్రకటించాలని సూచించారు. రైతులకు మద్దతిస్తున్న వారిలో బీజేపీ నేతలు కూడా ఉన్నారని, వరుణ్ గాంధీ, సత్య పాల్ మాలిక్ తరహాలోనే బల్యాన్ కూడా రైతులకు మద్దతు ప్రకటించాలని అన్నారు.


''రైతుల ఆందోళన రాజకీయరూపు సంతరించుకుంటోంది. రాజకీయాల్లోకి వచ్చే హక్కు అందరికీ ఉంది. వాళ్లు (సంయుక్త కిసాన్ మోర్చా) రాజకీయాల్లోకి రావాలనుకుంటే మేము స్వాగతిస్తాం'' అని బల్యాన్ ఆదివారంనాడు వ్యాఖ్యానించారు. దీనిపై టికాయత్ స్పందిస్తూ, ఓటేసి ప్రజలు గెలిపించినందున రైతులకు నేతలు మద్దతు ప్రకటించాలని, ప్రభుత్వంలో ఉంటూ రైతులకు మద్దతిచ్చే వారు...రైతులతో చర్చలకు చొరవ చూపించి వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు.

Updated Date - 2021-09-06T23:17:52+05:30 IST