రాజన్న సన్నిధిలో సంక్రాంతి రద్దీ
ABN , First Publish Date - 2022-01-17T06:23:18+05:30 IST
దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శని, ఆదివారాల్లో భక్తులతో రద్దీగా మారింది. సంక్రాంతి సందర్భంగా శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.
వేములవాడ, జనవరి 16 : దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శని, ఆదివారాల్లో భక్తులతో రద్దీగా మారింది. సంక్రాంతి సందర్భంగా శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు కోడెమొక్కు చెల్లించుకున్నారు. స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తల్తెకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
స్వామివారికి ఘనంగా రుద్రాభిషేకం
వేములవాడ రాజరాజేశ్వరస్వామివారికి ఆదివారం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ నేతృత్వంలో అర్చకులు స్వామివారి ఉదయం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతలకు అర్చనలు, సాయంత్రం సదస్యము నిర్వహించారు.