వేటు పడింది

ABN , First Publish Date - 2020-06-07T06:37:55+05:30 IST

సంతబొమ్మాళి కానిస్టేబుల్‌ సత్తిరాజుపై వేటు పడింది. ‘కరోనా’ నిబంధనలు ఉల్లంఘిస్తూ..

వేటు పడింది

సంతబొమ్మాళి కానిస్టేబుల్‌ సత్తిరాజు సస్పెన్షన్‌ 

క్వారంటైన్‌ కేంద్రం నుంచి యువతి  తరలింపు ఘటనపై సీఐ ప్రాథమిక విచారణ


సంతబొమ్మాళి, జూన్‌ 6: సంతబొమ్మాళి కానిస్టేబుల్‌ సత్తిరాజుపై వేటు పడింది. ‘కరోనా’ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. ఓ యువతిని క్వారంటైన్‌ కేంద్రం నుంచి ఇతర ప్రాంతానికి తరలించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను విధుల నుంచి ఎస్పీ అమ్మిరెడ్డి సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాకు చెందిన ఓ యువతి కోల్‌కతా నుంచి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం రాత్రి ఇచ్ఛాపురం స్టేషన్‌లో దిగింది. అక్కడి నుంచి తోటి ప్రయాణికులతో కలిసి ఆమెను అధికారులు లక్ష్మీపురం పునరావాస కేంద్రానికి తరలించారు. అయితే.. అక్కడ మహిళలు ఉండేందుకు సదుపాయాలు లేవని, ఇబ్బందిగా ఉందని, తాను హోం క్వారంటైన్‌లో ఉండేందుకు టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నానని ఆ యువతి కానిస్టేబుల్‌ సత్తిరాజు వద్ద మొరపెట్టుకుంది.


దీంతో ఆ కానిస్టేబుల్‌ ఆమెను క్వారంటైన్‌ కేంద్రం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించారు. మరుసటి రోజు ఉదయం ఆమె కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను హోం క్వారంటైన్‌కు తీసుకువెళ్లారు. ఈ విషయం బయటకు పొక్కడంతో శుక్రవారం ఆర్డీవో విచారణ చేశారు. ఈ ఘటనపై మళ్లీ విచారణ చేపట్టాలని ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో శనివారం టెక్కలి సీఐ నీలయ్య విచారణ చేసి.. వివరాలు సేకరించి నివేదిక అందించారు. ప్రాథమిక విచారణ అనంతరం కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2020-06-07T06:37:55+05:30 IST