సునంద పుష్కర్ ట్విటర్ అకౌంట్‌ను భద్రపరచండి : శశి థరూర్

ABN , First Publish Date - 2020-06-05T01:28:51+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ గురువారం ఢిల్లీ హైకోర్టును

సునంద పుష్కర్ ట్విటర్ అకౌంట్‌ను భద్రపరచండి : శశి థరూర్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 2014లో మరణించిన తన భార్య సునంద పుష్కర్ ట్విటర్ ఖాతాను, ట్వీట్లను సురక్షితంగా భద్రపరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఈ నెల 8న విచారణ జరిపే అవకాశం ఉంది. 


సునంద పుష్కర్ ట్విటర్ అకౌంట్, ట్విటర్ టైమ్‌లైన్ చాలా ముఖ్యమైనవని, ఆమె సజీవంగా లేనందువల్ల, ఆమె ట్విటర్ అకౌంట్, ట్వీట్లను  డిలీట్ చేస్తారేమోననే భయం ఉందని శశి థరూర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై నేరారోపణల నుంచి తనకు విముక్తి కలగాలంటే, సునంద పుష్కర్ ట్వీట్లు చాలా అవసరమని హైకోర్టుకు తెలిపారు. 


సునంద పుష్కర్ అనుమానాస్పద మరణం కేసులో శశి థరూర్ నిందితుడు. ట్రయల్ కోర్టు సమక్షంలో ఈ కేసు విచారణలో ఉన్నందువల్ల సునంద పుష్కర్ ట్విటర్ అకౌంట్, ట్వీట్లను పరిరక్షించాలని ‘ట్విటర్ ఇండియా’ను కోరాలని పోలీసులను ఆదేశించాలని శశి థరూర్ హైకోర్టును కోరారు.


శశి థరూర్‌పై ఐపీసీ సెక్షన్లు 498ఏ, 306 ప్రకారం నేరారోపణలు నమోదయ్యాయి. భార్యను క్రూరంగా వేధించినట్లు, ఆత్మహత్యకు ప్రోత్సహించినట్లు కేసు నమోదైంది. 


సునంద పుష్కర్ 2014 జనవరి 17 రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఢిల్లీలోని చాణక్య పురిలో ఉన్న ఓ విలాసవంతమైన హోటల్‌లో ఆమె మరణించిన సంగతి తెలిసిందే.


Updated Date - 2020-06-05T01:28:51+05:30 IST