జయ మెమోరియల్‌ను సందర్శించనున్న శశికళ

ABN , First Publish Date - 2021-10-08T21:34:08+05:30 IST

కొద్దికాలంగా స్తబ్దుగా ఉన్న అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ ఈనెల 16న దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి..

జయ మెమోరియల్‌ను సందర్శించనున్న శశికళ

చెన్నై: కొద్దికాలంగా స్తబ్దుగా ఉన్న అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ ఈనెల 16న దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత స్మారకాన్ని సందర్శించనున్నారు. అన్నాడీఎంకే గోల్డెన్ సెలబ్రేషన్లకు ఒకరోజు ముందుగానే 'పురట్చి తలైవి' స్మారకాన్ని ఆమె సందర్శించనుండటం ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసులో నాలుగేళ్ల పాటు బెంగళూరులో పరపన్న జైలులో శిక్ష అనుభవించి విడుదలైన అనంతరం జయలలిత స్మారకాన్ని శశికళ సందర్శించనుండటం ఇదే ప్రథమం. దీనికితోడు ఈనెల 12 'లోకల్ రూరల్ బాడీ' ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందు శశికళ పావులు కదుపుతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.


స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకేకు మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లయితే పార్టీని కాపాడగలిగేది తానేనంటూ మరింత బలంగా శశికళ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అన్నాడీఎంకే కార్యకర్తలను తనవైపు తిప్పుకునేందుకు ఆమె ప్రయత్నించే అవకాశాలు ఉండొచ్చని చెబుతున్నారు. గత రెండు నెలలుగా శశికళతో కొందరు పార్టీ సభ్యులు మంతనాలు సాగించినట్టు కొన్ని ఆడియోలు కూడా లీక్ అయ్యాయి. పార్టీని కాపాడి, అమ్మరాజ్యాన్ని తిరిగి తెస్తామని శశికళ చెబుతున్నట్టు ఆ ఆడియో టేపుల్లో వినిపిస్తోంది. కాగా, అన్నాడీఎంకే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లు ఏడాది పాటు జరిపేందుకు ప్లాన్ చేస్తోంది.

Updated Date - 2021-10-08T21:34:08+05:30 IST