దేశ బహిష్కృతుల కోసం.. భారత్‌కు సౌదీ రిపాట్రియేషన్ విమానం !

ABN , First Publish Date - 2020-10-16T16:29:21+05:30 IST

దేశం నుంచి బహిష్కరణకు గురైన భారత ప్రవాసుల కోసం సౌదీ అరేబియా ప్రత్యేక పాట్రియేషన్ విమానం ఏర్పాటు చేసింది.

దేశ బహిష్కృతుల కోసం.. భారత్‌కు సౌదీ రిపాట్రియేషన్ విమానం !

రియాద్: దేశం నుంచి బహిష్కరణకు గురైన భారత ప్రవాసుల కోసం సౌదీ అరేబియా ప్రత్యేక పాట్రియేషన్ విమానం ఏర్పాటు చేసింది. 362 మందితో బుధవారం సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రియాద్ నుంచి న్యూఢిల్లీకి బయల్దేరింది. ఈ 362 మందిలో 211 మంది రియాద్ బహిష్కరణ కేంద్రానికి చెందిన వారు ఉంటే, 151 మంది జెడ్డా బహిష్కరణ కేంద్రానికి చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక దేశ బహిష్కరణకు గురైన ప్రవాసుల్లో చాలా మంది జైలు శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. భారత్, సౌదీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇప్పటివరకు సౌదీ అరేబియా తమ దేశం నుంచి బహిష్కరించిన 1,945 మంది భారతీయులను స్వదేశానికి పంపించింది. దేశ బహిష్కరణకు గురైన తమను స్వదేశానికి వెళ్లడంలో సహకరించినందుకు సౌదీ అరేబియా, భారత ప్రభుత్వాలకు ప్రవాసులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.


కాగా, ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సౌదీ.. బహిష్కృతుల తరలింపును మేలో ప్రారంభించింది. తొలిసారి 421 మందిని(రియాద్ నుంచి 214, జెడ్డా నుంచి 207) ఇండియాకు తరలించింది. ఆ తర్వాత అక్టోబర్ 6న రెండోసారి న్యూఢిల్లీ, లక్నోకు రెండు రిపాట్రియేషన్ విమానాలు నడిపింది. సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్, జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జీఏసీఏ)తో పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో సహా సౌదీ అధికారులు అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా మిషన్ ప్రశంసించింది.  

Updated Date - 2020-10-16T16:29:21+05:30 IST