భారత్కు వచ్చే విమానాలకు సౌదీ గ్రీన్ సిగ్నల్ !
ABN , First Publish Date - 2020-09-25T11:47:56+05:30 IST
వందే భారత్ మిషన్ కింద భారతదేశానికి వచ్చే ప్రయాణికుల విమానాలకు సౌదీ అరేబియా అనుమతి ఇచ్చిందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 : వందే భారత్ మిషన్ కింద భారతదేశానికి వచ్చే ప్రయాణికుల విమానాలకు సౌదీ అరేబియా అనుమతి ఇచ్చిందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ నుంచి విమాన రాకపోకలపై సౌదీ అరేబియా మంగళవారం నిషేధం విధించింది. దాంతో భారత్ నుంచి సౌదీ అరేబియాకు ప్రయాణికులను తీసుకెళ్లడంలేదని బుధవారం రాత్రిఎయిర్ ఇం డియా ఎక్స్ప్రెస్ ట్విటర్ ద్వారా స్పష్టం చేసింది. అయితే వందే భారత్ మిషన్ విమానాలు సౌదీ నుంచి స్వదేశానికి రావలసిన ప్రయాణికులను భారత్కు తీసుకురావడం కొనసాగిస్తాయని పేర్కొంది.
విమానాలలో లగేజీపై పరిమితి
దేశీయ ప్రయాణికుల విమానాలలో లగేజీపై ప రిమితి విధించడానికి విమానయాన సంస్థలకు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ అనుమతించింది. కరోనా వైరస్ నేపథ్యంలో రెండు నెలల విరామం తరువాత మే 25 నుంచి దేశీయ ప్రయాణికుల విమానాలు తిరగడం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒక ప్రయాణికుడికి ఒక లగేజీ బ్యాగ్, ఒక చేతి బ్యాగు రెండు మాత్రమే అనుమతించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. లగేజీపై పరిమితి ఉంటుందని ఈ నెల 23న జారీ చేసిన ఉత్తర్వులలో తెలిపింది.