క్రికెటర్ల భార్యలపై నటి షెర్లీన్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-09-25T01:38:18+05:30 IST
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ బాలీవుడ్,
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ బాలీవుడ్, శాండల్వుడ్, టాలీవుడ్ను అల్లుకుపోతోంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో మొదలైన ఈ కేసులో ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్ల మెడకు చుట్టుకుంది.
తాజాగా మోడల్, నటి షెర్లీన్ చోప్రా మరో బాంబు పేల్చింది. కోల్కతాలో జరిగిన ఐపీఎల్ ఆఫ్టర్ పార్టీలో క్రికెటర్లు డ్రగ్స్ తీసుకుంటుండగా, వారి భార్యలు కొకైన్ పీల్చుతుండగా తాను చూశానని సంచలన వ్యాఖ్యలు చేసింది.
కేకేఆర్ మ్యాచ్ చూసేందుకు తాను కోల్కతా వెళ్లానని, మ్యాచ్ తర్వాత జరిగిన పార్టీకి తనను ఆహ్వానిస్తే వెళ్లానని షెర్లీన్ చోప్రా పేర్కొంది. ఆ పార్టీకి ప్రముఖ క్రికెటర్లు, వారి భార్యలు కూడా వచ్చారని గుర్తు చేసుకుంది. పార్టీలో తాను ఎంజాయ్ చేశానని, అయితే వాష్రూములో జరుగుతున్నది చూసి షాకయ్యానని తెలిపింది.
లేడీస్ వాష్ రూములో స్టార్ల భార్యలు కొకైన్ పీలుస్తూ కనిపించారని, పురుషుల వాష్ రూములోనూ ఇదే సీన్ జరుగుతూ ఉండొచ్చని అనుకున్నానని పేర్కొంది. వారు తనను చూసి నవ్వారని, బదులుగా తాను కూడా నవ్వానని తెలిపింది. తాను ఉండకూడని ప్రదేశంలో ఉన్నానని గ్రహించి వెంటనే పార్టీ నుంచి బయటకు వచ్చేశానని షెర్లీన్ వివరించింది. అయితే, ఆ క్రికెటర్లు ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. ఎన్సీబీ అధికారులు కనకు తనను అడిగితే పూర్తి వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని షెర్లీన్ పేర్కొంది.