మార్చి 2న ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ

ABN , First Publish Date - 2020-02-21T06:42:42+05:30 IST

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా (ఎస్‌బీఐ)కు చెందిన ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) మార్చి 2న ప్రారంభంకానుంది.

మార్చి 2న ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ

  • 5న ముగింపు 8 ఐపీఓ ధర రూ.745-775!
  • రూ. 9,000 కోట్ల సమీకరణ లక్ష్యం

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా (ఎస్‌బీఐ)కు చెందిన ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) మార్చి 2న ప్రారంభంకానుంది. మార్చి 5న ముగుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.9,000 కోట్లు సమీకరించనుంది. బిడ్‌/ఆఫర్‌ ప్రారంభ తేదీకన్నా ఒక రోజు ముందు యాంకర్‌ ఇన్వెస్టర్ల బిడ్‌ ఉంటుంది. అది ఫిబ్రవరి 28 తేదీన ఉండవచ్చని సమాచారం. క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బయ్య ర్ల (క్యూఐబీ) సబ్‌స్ర్కిప్షన్‌ మార్చి 4న ఉండనుంది. సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రాల ప్రకారం.. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూట్‌ ద్వారా 130,526,798 వరకు ఈక్విటీ షేర్లను ఎస్‌బీఐ కార్డ్స్‌ ఆఫర్‌ చేయనుంది. ఇందులో 37,293,371 వరకు ఎస్‌బీఐ, 93,233,427 వరకు షేర్లను కార్లైల్‌ గ్రూప్‌ ఆఫర్‌ చేస్తుం ది. వీటికి అదనంగా కంపెనీ రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. కాగా ఐపీఓలో ఆఫర్‌ ధరను ఒక్కో షేరుకు రూ.745-775గా నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. 


  • ఎస్‌బీఐ కార్డ్స్‌లో ఎస్‌బీఐకి 76 శాతం వాటా ఉంది. మిగతా వాటా కార్లైల్‌ గ్రూప్‌నకు ఉంది. 

  • ఎస్‌బీఐ కార్డ్స్‌ దేశంలో రెండో అతిపెద్ద క్రెడిట్‌ కార్డుల జారీ కంపెనీ. దీనికి 18 శాతం మార్కెట్‌ వాటా ఉంది. 

  • ఎస్‌బీఐ, జీఈ క్యాపిటల్‌ 1998 అక్టోబరులో ఎస్‌బీఐ కార్డ్స్‌ను ప్రారంభించాయి. 

  • 2017 డిసెంబరులో ఎస్‌బీఐ, కార్లైల్‌ గ్రూప్‌.. జీఈ క్యాపిటల్‌ వాటాను కొనుగోలు చేశాయి. 

  • ఎస్‌బీఐ కార్డ్స్‌ లిస్టింగ్‌తో ఎస్‌బీఐలో లిస్టయిన కంపెనీల సంఖ్య ఐదుకు చేరనుంది. 

Updated Date - 2020-02-21T06:42:42+05:30 IST