బడికి వేళాయె!

ABN , First Publish Date - 2020-09-21T07:56:48+05:30 IST

కొవిడ్‌-19 ఉధృతితో మూతపడిన పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి

బడికి వేళాయె!

సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకోనున్న పాఠశాలలు

తల్లిదండ్రుల అంగీకారంతో 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రవేశం

పంపడానికి ఇష్టపడని తల్లిదండ్రులు


(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌-19 ఉధృతితో మూతపడిన పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. ఉపాధ్యాయులంతా హాజరు కావాలని విద్యా శాఖ ఇటీవల ఆదేశాలిచ్చింది. అయితే విద్యార్థులకు పాఠాలు చెప్తారా, చెప్పరా అనే దానిపై స్పష్టత లేదు. కానీ 9, 10 తరగతుల విద్యార్థులు పాఠశాలలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎంఈవోలకు ఉత్వర్వులు జారీ అయ్యాయి. తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వకంగా లేఖలు తీసుకున్న తర్వాత మాత్రమే తరగతి గదుల్లోకి విద్యార్థులను ఆహ్వానించాలని పై నుంచి ఆదేశాలొచ్చాయి. ఒకవేళ తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు అంగీకరిస్తే, తరగతి గదుల్లో పిల్లలకు పాఠ్యాంశాల్లో సందేహాలను మాత్రమే నివృత్తి చేస్తారని విద్యాశాఖాధికారులు తెలిపారు.


విద్యా కానుక కిట్ల పంపిణీ వచ్చే నెలకు వాయిదా వేశారు. కాగా పిల్లలను స్కూళ్లకు పంపే విషయంలో అధిక శాతం తల్లిదండ్రుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వ్యతిరేకిస్తుండగా ఇంకొందరు రక్షణ చర్యలు తీసుకుని పాఠాలు చెప్తే పర్వాలేదని అంటున్నారు. వైరస్‌ ఉధృతి కొనసాగుతుండగా పిల్లలను పాఠశాలలకు పంపడానికి కొందరు ఇష్టపడడం లేదు. ఎవరిలో వ్యాధి లక్షణాలున్నాయో తెలియని పరిస్థితిలో తెలిసితెలిసీ తమ పిల్లలను వ్యాధికి గురి చేయలేమని మరి కొందరు చెప్తున్నారు. దీంతో పాఠశాలలకు ఎంతమంది పిల్లలు వస్తారనేది వేచి చూడాలి.

Updated Date - 2020-09-21T07:56:48+05:30 IST