హోంవర్క్ చేయలేదని పిల్లాడిని కఠినంగా శిక్షించిన టీచర్.. తరువాత స్కూల్లో ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2021-10-22T11:52:30+05:30 IST
రాజస్థాన్లో ఒక ప్రైవేట్ స్కూల్లో జరిగిన ఘటన రాష్ట్రమంతా కలకలం రేపింది. స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న ఒక బాలుడు హోంవర్క్ చేయలేదని తరగతి టీచర్ అతడిని చాలా కఠినంగా శిక్షించాడు...
రాజస్థాన్లో ఒక ప్రైవేట్ స్కూల్లో జరిగిన ఘటన రాష్ట్రమంతా కలకలం రేపింది. స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న ఒక బాలుడు హోంవర్క్ చేయలేదని తరగతి టీచర్ అతడిని చాలా కఠినంగా శిక్షించాడు. టీచర్ ఆ బాలుడిని శిక్షించిన తీరు చూసిన మిగతా విద్యార్థులకు వెన్నులో వణుకు పుట్టింది. వివరలలోకి వెళితే..
రాజస్థాన్లోని చురు జిల్లా కోల్సర్ గ్రామంలో చదివే 13 ఏళ్ల గణేశ్ గత మంగళవారం రోజులాగే స్కూల్కు వెళ్లాడు. అలా వెళ్లినవాడు తిరిగి రాలేదు. ఆ స్కూల్ టీచర్ మనోజ్ కుమార్ అంటే అందరికీ భయం. స్కూల్లో ప్రస్తుతానికి ప్రిన్సిపాల్ లేకపోవడంతో అతనే ప్రిన్సిపాల్గా కూడా ఉన్నాడు. మంగళవారం మనోజ్ కుమార్ ఏడవ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి వెళ్లాడు.
తరగతి గదిలో పిల్లలందరినీ ఒక్కొకరిగా పిలిచి అంతకు ముందు రోజు ఇచ్చిన హోంవర్క్ చూపించమన్నాడు. అలా క్లాస్ రూంలో హోంవర్క్ చేయని వారిని ఒక వరుసలో నిల్చోబెట్టాడు. ఆ వరుసులో ముందుగా గణేశ్ అనే విద్యార్థి ఉన్నాడు. హోంవర్క్ ఎందుకు చేయలేదు? అనే ప్రశ్నకు గణేశ్ సమాధానం చెప్పకపోయేసరికి టీచర్ మనోజ్ కుమార్ ఆ పిల్లాడిని ముందు ఎడా పెడా కొట్టడం మొదలుపెట్టాడు. అలా కొడుతూనే ఉన్నాడు. మిగతా విద్యార్థులంతా అది చూసి భయపడి పోయారు. గణేశ్ ఆ దెబ్బలకు తాళలేక పోయాడు. స్పృహ తప్పి కింద పడిపోయాడు. అయినా అతడిని లేపి మరీ కొట్టాడు. ఈ సారి గణేశ్ తలను నేలకేసి బలంగా కొట్టాడు. ఆ కారణంగా గణేశ్ తలలోంచి రక్తం వచ్చింది.
అది చూసిన టీచర్ మనోజ్ కుమార్ ఏం చేయాలో తోచక మిగతా టీచర్లను సహాయానికి పిలిచాడు. వారంతా గణేశ్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. గణేశ్ని ఆస్పత్రికి తరలించగా.. ఒక విద్యార్థి గణేశ్ ఇంటికి వెళ్లి అతని తండ్రికి జరిగిన విషయం చెప్పాడు. గణేశ్ తండ్రి పరుగు పరుగున ఆస్పత్రికి చేరుకోగా.. డాక్టర్లు గణేశ్ చనిపోయి చాలాసేపైందని చెప్పారు. దీంతో ఆ తండ్రి షాక్కు గురయ్యాడు. గణేశ్ తల్లి అనారోగ్యంగా ఉండడంతో ఆమెకు అతడు మరణించిన వార్త ఇంకా వినిపించలేదు.
గణేశ్ తండ్రి టీచర్ మనోజ్ కుమార్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిగతా విద్యార్థుల వాంగ్మాలం తీసుకొని.. టీచర్ మనోజ్ కుమర్పై హత్య నేరం కింద కేసు నమోదు చేశారు. మనోజ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉండగా.. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.