Vangaveeti Radha ఇంటి వద్ద స్కూటీ కలకలం.. ఇంతకీ ఎవరిది ఇది..!?

ABN , First Publish Date - 2021-12-31T08:42:48+05:30 IST

‘నన్ను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారు’ అంటూ వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యల తర్వాత ...

Vangaveeti Radha ఇంటి వద్ద స్కూటీ కలకలం.. ఇంతకీ ఎవరిది ఇది..!?

  • నాలుగు రోజులుగా నిలిపి ఉన్న వాహనం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్యాలయ సిబ్బంది
  • పక్కనే ఉన్న స్వీట్‌ స్టాల్‌లోని వర్కర్‌దిగా గుర్తింపు
  • వంగవీటిని పరామర్శించిన టీడీపీ నేతలు


విజయవాడ, అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘నన్ను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారు’ అంటూ వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యల తర్వాత ఏ చిన్న పరిణామం చోటుచేసుకున్నా అది సంచలనమే అవుతోంది. రెండు రోజుల క్రితం వైసీపీ కార్పొరేటర్‌, ఫ్లోర్‌ లీడర్‌ వెంకట సత్యనారాయణను పోలీసులు ఆరా తీయడం దుమారాన్ని రేపింది. తాజాగా రాధా కార్యాలయం ఎదురుగా ఒక స్కూటీ పార్క్‌ చేసి ఉండడం సంచలనమైంది. వంగవీటికి మహాత్మాగాంధీ రోడ్డును ఆనుకుని కార్యాలయం ఉంది. దీనికి ఎదురుగా ఇల్లు ఉంది. ఈ ఇంట్లోనే వంగవీటి మోహన్‌రంగా ఉండేవారు. రాధా ఇక్కడికి వచ్చినప్పుడు కార్యాలయంలో ఉంటారు. నాలుగు రోజులుగా కృష్ణా జిల్లా రిజిస్ట్రేషన్ నంబరు కలిగిన స్కూటీ ఇంటి వద్ద పార్క్‌ చేసి ఉంది. దీన్ని రాధా కార్యాలయంలోని సిబ్బంది గురువారం ఉదయం గుర్తించారు. వెంటనే గవర్నరుపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని స్కూటీని పరిశీలించారు. రాధా కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న స్వీట్స్‌ షాపు నుంచి ఒక వ్యక్తి పోలీసుల వద్దకు వెళ్లి ఆ స్కూటీ తమ షాపులో పనిచేసిన వ్యక్తిదని వివరించారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను చూపించాలంటూ పోలీసులు వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు.


ఆ స్వీట్‌ షాపులో గతంలో పనిచేసిన కాశీరాజు ప్రస్తుతం ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం బీసెంట్‌ రోడ్డుకు వచ్చిన కాశీరాజు.. వాహనం పాడైపోవడంతో స్కూటీని స్వీట్‌ షాపు వద్ద పార్క్‌ చేసి తాళం వేశాడు. ఈ విషయం షాపు వర్కర్లు రాధా కార్యాలయ సిబ్బందికి చెప్పకపోవడంతో వారు అనుమానం వ్యక్తంచేశారు. వరుస సంచలనాల వెలుగులో టీడీపీ నేతలు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటున్న రాధా ఇంటికి వెళ్లి పరామర్శించారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ తదితరులు రాధాతో భేటీ అయ్యారు. జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. మరోపక్క ఎంజీ రోడ్డులోని రాధా కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. 


టీడీపీలో ఉన్నందుకే రెక్కీ: కళా వెంకట్రావు

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో ఉన్నందుకే వైసీపీ నేతలు ఆయనపై రెక్కీ నిర్వహించారని తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. గురువారం ఆయన తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ‘‘వంగవీటి రాధా వైసీపీని వీడి టీడీపీలో చేరినందుకు ఆయనపై కక్ష పెంచుకొన్నారు. దానిలో భాగంగానే ఈ రెక్కీ జరిగింది. పైకి మాత్రం ఆయనపై వైసీపీ నేతలు ఎక్కడ లేని ప్రేమ చూపిస్తూ నాటకం ఆడుతున్నారు. రెక్కీ జరిగి అనేక రోజులైంది.  ఆ వ్యక్తులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. వైసీపీలో ఉన్న వ్యక్తులు రెక్కీ చేయడం వల్లే వారిపై ఏ చర్యలూ లేవు’’ అని ఆరోపించారు.

Updated Date - 2021-12-31T08:42:48+05:30 IST