దగ్గు, తుమ్ములు, జ్వరాలు రాకుండా ఉండాలంటే..
ABN , First Publish Date - 2020-08-06T23:15:27+05:30 IST
వర్షాకాలంలో దగ్గు, తుమ్ములు, జ్వరాలు రాకుండా ఏదైనా ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాలా?
ఆంధ్రజ్యోతి(06-08-2020)
ప్రశ్న: వర్షాకాలంలో దగ్గు, తుమ్ములు, జ్వరాలు రాకుండా ఏదైనా ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాలా?
- గంగిరెడ్డి, ప్రకాశం
డాక్టర్ సమాధానం: వర్షాలు పడడం మొదలవగానే ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణంలో తేమ కూడా పెరుగుతుంది. ఈ పరిస్థితులు సూక్ష్మజీవులు పెరగడానికి వ్యాపించడానికి ఎంతో అనుకూలమైనవి. అందువల్ల వర్షాలు మొదలవగానే జలుబు, జ్వరాలు మొదలవుతాయి. రకరకాల వైరస్, బాక్టీరియా వంటి సూక్ష్మజీవులవలన ఈ అనారోగ్యాలు వస్తాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు కొంతవరకు ఈ అనారోగ్యాల నుండి రక్షణ పొందవచ్చు. రోగనిరోధక శక్తి కోసం కొన్ని రకాల పోషకపదార్ధాలు అత్యవసరం. నిమ్మ, నారింజ, ఆపిల్, జామ, వంటి తాజా పండ్లన్నిటిలోను అధికంగా ఉండే విటమిన్ సి, బాదాం, పిస్తా, ఆక్రోట్, పొద్దుతిరుగుడు గింజల వంటి వాటిలో ఉండే విటమిన్ ఈ, అరటి పండ్లు, ఉడికించిన దుంపలు, ఉడికించిన సెనగల్లో ఉండేటు వంటి విటమిన్ బీ6, కారెట్, బొప్పాయి, గుమ్మడి మొదలైన వాటిల్లో ఉండే విటమిన్ ఏ, ఆకుకూరల్లో, పప్పు ధాన్యాల్లో ఉండేటువంటి ఫోలేట్, సూర్యరశ్మి నుండి వచ్చే విటమిన్ డీ, మాంసాహారం, ఆకుకూరల నుండి వచ్చే ఐరన్, పెరుగు, మజ్జిగ నుండి వచ్చే ప్రోబయాటిక్స్ వంటివన్నీ కూడా రోగనిరోధక శక్తికి ఎంతో అవసరం. సరైన ఆహారం తీసుకోవడమే కాకుండా ఈ సూక్ష్మజీవుల బారిన పడకుండా ఉండాలంటే శుచి శుభ్రత విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమే.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)