అదానీ కంపెనీలపై సెబీ దర్యాప్తు
ABN , First Publish Date - 2021-07-20T06:12:54+05:30 IST
అదానీ గ్రూప్లోని కొన్ని కంపెనీలపై క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి ‘సెబీ’తో పాటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) దర్యాప్తు జరుపుతున్నాయి.
- డీఆర్ఐ సైతం కన్నేసింది..
- ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ వెల్లడి
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్లోని కొన్ని కంపెనీలపై క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి ‘సెబీ’తో పాటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) దర్యాప్తు జరుపుతున్నాయి. లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు గాను లిఖితపూర్వక సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ ఈ విషయాన్ని వెల్లడించారు. సెబీ చట్టం, రెవెన్యూ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి వేర్వేరుగా దర్యాప్తులు జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు. ఏయే కంపెనీలు దర్యాప్తు ఎదుర్కొంటున్నాయి, కంపెనీలు ఏ నిబంధనల్ని ఉల్లంఘించాయన్న విషయాలను ఆయన వెల్లడించలేదు. అదానీ గ్రూప్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు మాత్రం జరగట్లేదని చౌదరీ స్పష్టం చేశారు. ఈ విషయంపై అదానీ గ్రూప్ అధికారిక ప్రతినిధి స్పందిస్తూ.. సెబీ నిబంధనలకు లోబడే వ్యాపా రం చేస్తున్నామని, ఈ మధ్య కాలంలో నియంత్రణ మండలి నుంచి నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి తామెలాంటి సమాచారం అందుకోలేదన్నారు. ఐదేళ్ల క్రితం అదానీ పవర్కు డీఆర్ఐ షోకాజు నోటీసు జారీ చేసిందని, ఆ కేసు ప్రస్తుతం అపిల్లేట్ ట్రైబ్యునల్లో ఉందన్నారు.
విదేశీ ఫండ్ల ఖాతాల స్తంభనపై..
అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు కలిగి ఉన్న ఆరు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వె్స్టమెంట్ (ఎ్ఫపీఐ) ఫండ్లలో మూడింటి డీమ్యాట్ ఖాతాలను 2016లో స్తంభింపజేసినట్లు మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. అయితే, కొన్ని లిస్టెడ్ కంపెనీలు జారీ చేసిన గ్లోబల్ డిపాజిటరీ రిసీట్ (జీడీఆర్)లకు సంబంధించిన విషయంలోనే ఆ మూడు ఫండ్ల డీమ్యాట్ ఖాతాలను ఫ్రీజ్ చేశారన్నారు. అంతేతప్ప, మిగతా కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి కాదని ఆయన స్పష్టం చేశారు. అదానీ గ్రూప్ కంపెనీల్లో అధిక వాటాలు కలిగిన అల్బులా ఇన్వె్స్టమెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వె్స్టమెంట్ ఫండ్లకు చెందిన డీమ్యాట్ ఖాతాలను ఎన్ఎ్సడీఎల్ ఫ్రీజ్ చేసిందని, ఆ మూడు అకౌంట్లలోని అదానీ కంపెనీల షేర్ల విలువ రూ.43,500 కోట్లని గత నెలలో ఓ ఆంగ్ల మీడియా రిపోర్టు వెల్లడించింది. ఆ కథనంలో వాస్తవం లేదని అదానీ వివరణ ఇచ్చినప్పటికీ, గ్రూప్ కంపెనీల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి.
అదానీ షేర్లు డౌన్
సెబీ, డీఆర్ఐ దర్యాప్తు విషయం వెలుగుచూసిన నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లు క్షీణించాయి. సోమవారం బీఎ్సఈలో ట్రేడింగ్ ముగిసేసరికి ఈ గ్రూప్లోని 6 లిస్టెడ్ కంపెనీల షేర్లు 4.77 శాతం వరకు నష్టపోయాయి.