భర్త దెబ్బలను తట్టుకోలేక ఆమె కిందపడిపోయింది.. వెంటనే భార్య గొంతు నులిమాడు.. ఇదంతా చూసిన చిన్నారి ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2021-10-09T15:34:25+05:30 IST

ఆడపిల్ల అయినా, మగపిల్లాడైనా ఒకటేనని... ఇద్దరూ సమానమేనని...

భర్త దెబ్బలను తట్టుకోలేక ఆమె కిందపడిపోయింది.. వెంటనే భార్య గొంతు నులిమాడు.. ఇదంతా చూసిన చిన్నారి ఏం చేసిందంటే..

ఆడపిల్ల అయినా, మగపిల్లాడైనా ఒకటేనని... ఇద్దరూ సమానమేనని ఆధునిక సమాజం గొంతుచించుకుంటున్నా కొన్ని ప్రాంతాల్లో ఈ వివక్ష కొనసాగుతూనే ఉంది. తాజాగా రాజస్థాన్‌లో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. బడ్మేర్ జిల్లాలోని బాటాడా రామ్‌పూర్ గ్రామంలో జరిగిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. కొడుకు పుట్టలేదని భార్యను కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచి హత్య చేశాడు ఓ ప్రబుధ్దుడు. అతను మరో వివాహం చేసుకునేందుకు సిద్ధమవడంతో భార్య అడ్డుకుంది. దీంతో అతను భార్యపై దాడి చేశాడు. తరువాత ఆమె గొంతునొక్కి హతమార్చాడు. వివరాల్లోకి వెళితే బాటాడా రామ్‌పూర్ నివాసి షెరారామ్, అతని భార్య సరస్వతి ఏదో విషయమై తరచూ గొడవపడుతుంటారు. వీరికి 11 ఏళ్ల క్రితమే వివాహం కాగా, ఒక కుమార్తె కూడా ఉంది. 


అయితే సరస్వతికి మగపిల్లలు కలగకపోవడంతో షెరారామ్ మరో వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే ఇది అతని భార్య సరస్వతికి నచ్చలేదు. దీంతో తన మార్గానికి అడ్డువస్తున్న భార్యను తప్పించాలనుకున్న షెరారామ్ సెప్టెంబరు 26న రాత్రి భార్యతో గొడవకు దిగాడు. తరువాత కర్రతో ఆమెపై దాడి చేశాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న వారి కుమార్తె దుర్గ కూడా గాయపడింది. తల్లిని కాపాడేందుకు వచ్చిన దుర్గకు తలపై, కంటిపై తీవ్ర గాయాలయ్యాయి. భర్త దాడి నుంచి తప్పించుకునేందుకు సరస్వతి ప్రయత్నించింది. అయినా ఫలితం లేకపోయింది. తీవ్రంగా గాయపడి కిందపడిపోయిన సరస్వతిని గొంతునొక్కి షెరారామ్ హత్య చేశాడు. ఎస్పీ ఆనంద్ శర్మ మాట్లాడుతూ భార్యపై దాడికి పాల్పడి ఆమెను హత్య చేసిన షెరారామ్ తీవ్రంగా గాయపడ్డాడని, ప్రస్తుతం  జోథ్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. తమ అదుపులో ఉన్న నిందితుడిని విచారిస్తున్నామన్నారు. చిన్నారి దుర్గకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారని తెలిపారు. కాగా చిన్నారి దుర్గ పోలీసులకు ఆ సంఘటనకు సంబంధించిన వివరాలన్నింటినీ తెలియజేసింది.



Updated Date - 2021-10-09T15:34:25+05:30 IST