‘దేశం’లో తగ్గింది... రాష్ట్రంలో పెరిగింది
ABN , First Publish Date - 2021-06-03T09:39:47+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని గట్టి దెబ్బ తీసింది. విద్యుత్ వాడకంలో ఇది స్పష్టంగా కనిపించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ లేకపోయినా
విద్యుత్ వాడకంపై సెకండ్ వేవ్ దెబ్బ
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని గట్టి దెబ్బ తీసింది. విద్యుత్ వాడకంలో ఇది స్పష్టంగా కనిపించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ లేకపోయినా ఈ సమయంలో విద్యుత్ వాడకం 14 శాతం తగ్గిపోయింది. పోయిన ఏడాది మే నెలలో దేశం మొత్తం లాక్డౌన్లో ఉంది. ఈసారి మే నెలలో దేశంలో ఎక్కడా పూర్తిస్థాయి లాక్డౌన్ లేదు. చాలా రాష్ట్రాల్లో మధ్యాహ్నం వరకూ మినహాయింపులు ఇచ్చారు. పరిశ్రమలను ఆపలేదు. అయినా విద్యుత్ వాడకం బాగా తగ్గిపోయింది.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు సేకరించిన సమాచారం ప్రకారం... గత ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా విద్యుత్ వాడకం 103 బిలియన్ యూనిట్లు. ఈ ఏడాది మే నెలలో ఆ వాడకం 89 బిలియన్ యూనిట్లకు పడిపోయింది. ‘‘కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేసింది. అందుకే లాక్డౌన్లు లేకపోయినా పారిశ్రామిక, వాణిజ్య రంగాలు బాగా దెబ్బతిన్నాయి. వాడకం పడిపోవడానికి ఇదే కారణమనుకొంటున్నాం’’ అని ఒక సీనియర్ అధికారి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాడకం పెరిగింది. పోయిన మే నెలలో రాష్ట్రంలో 4,364 మిలియన్ యూనిట్ల వాడకం ఉంటే ఈ మే నెలలో అది 4,724 మిలియన్ యూనిట్లకు పెరిగింది. పరిశ్రమలు పనిచేయడం, ఒకపూట వాణిజ్య సంస్థలు తెరవడానికి అనుమతి ఉండటం ఇందుకు కారణమని అధికార వర్గాలు తెలిపాయి.
విద్యుత్ సిబ్బందికి పురస్కారాలు
ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యుత్ సిబ్బందికి ప్రత్యేక ప్రశంసాపత్రాలు ఇవ్వాలని ట్రాన్స్కో నిర్ణయించింది. బుధవారం జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడినా, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను అందించారని ట్రాన్స్కో ఎండీ శ్రీకాంత్ ప్రశంసించారు.
క్షీణించిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు
భారత సముద్ర ఆహార ఉత్పత్తుల రంగంపై కొవిడ్ తీవ్ర ప్రభావం చూపుతోంది. కొవిడ్ కారణంగా 2020-21లో దేశవ్యాప్తంగా 10.88% సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు తగ్గాయి. కార్మికులు, కంటైనర్ల కొరత, సరుకు రవాణా విమాన చార్జీల పెరుగుదల, ఎయిర్కార్గో కనెక్టివిటీ తగ్గిపోవడంతో ఉత్పత్తుల రవాణా 39.91 శాతానికి పడిపోయింది. అయితే చివరి త్రైమాసంలో ఎగుమతులు పుంజుకున్నాయని ఎంపెడా చైర్మన్ కేఎస్ శ్రీనివాస్ తెలిపారు.