కరోనా కల్లోలం: వీడని చిక్కుముళ్లు.... చికిత్సకు దొరకని సరైన మార్గం!
ABN , First Publish Date - 2020-07-09T15:17:13+05:30 IST
ప్రపంచమంతా కరోనా వైరస్తో పోరాడుతోంది. కోట్లాది మంది ఈ అంటువ్యాధికి గురయ్యారు. ఈ వ్యాధి కారణంగా ఐదు లక్షల మందికి పైగా మృతిచెందారు. మరోవైపు కరోనా టీకా లేదా ఔషధం ఎప్పుడు...
న్యూయార్క్: ప్రపంచమంతా కరోనా వైరస్తో పోరాడుతోంది. కోట్లాది మంది ఈ అంటువ్యాధికి గురయ్యారు. ఈ వ్యాధి కారణంగా ఐదు లక్షల మందికి పైగా మృతిచెందారు. మరోవైపు కరోనా టీకా లేదా ఔషధం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది స్పష్టంగా తెలియడం లేదు. కరోనా వైరస్ ప్రవేశించి ఆరు నెలలకు పైగా సమయం గడిచింది. అయితే ఇప్పటికీ కరోనాకు సంబంధించిన కొన్ని చిక్కుముళ్లకు సమాధానం దొరకలేదు. దీనిపై సైన్స్ జర్నల్ నేచర్... ప్రపంచ శాస్త్రవేత్తల అభిప్రాయాలను ఉటంకిస్తూ ఒక నివేదికను ప్రచురించింది. దీనిలో ఈ అంటువ్యాధికి సంబంధించిన చిక్కుముళ్లను ప్రస్తావించారు. వీటికి సమాధానాలు ఇప్పటివరకు దొరకలేదని దానిలో పేర్కొన్నారు. ఈ ప్రశ్నలకు సరైన సమాధానం దొరికేంతవరకూ ఈ వైరస్ను సమర్థవంతంగా అరికట్టలేమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్న అంశాన్ని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ వైరస్ ఎక్కడ నుంచి ఉద్భవించిందో ఇప్పటివరకు వెల్లడికాలేదు. ఆరు నెలలు గడిచినప్పటికీ ఈ చిక్కుముడి అలానే ఉంది. గబ్బిలాల నుంచి మానవులకు ఈ వైరస్ వ్యాపించిందని ప్రాథమిక నివేదికల్లో పేర్కొన్నప్పటికీ, కొంతమంది శాస్త్రవేత్తలు ఈ వాదనను తోసిపుచ్చారు. అదేవిధంగా కరోనా వైరస్ బారిన పడిన బాధితులలో ఈ వైరస్ ప్రభావం ఎందుకు ఒక్కొక్కరిలో ఒక్కోలా మారుతూ వస్తుందో ఇప్పటికీ అంతుచిక్కలేదు. అదేవిధంగా కరోనా బారిన పడి, కోలుకున్న తరువాత సంబంధిత రోగి శరీరం వైరస్కు వ్యతిరేకంగా ఎంతకాలం రోగనిరోధక శక్తిగా ఉంటుందనే దానిపై శాస్త్రవేత్తలకు సమాధానం దొరకలేదు. దీంతో శాస్త్రవేత్తలు ఈ వైరస్ తీరుతెన్నులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.