జల రవాణాకు భద్రత కల్పించండి
ABN , First Publish Date - 2020-06-04T08:48:28+05:30 IST
జాతీయ జలమార్గం - 4కు అనుసంధానంగా రూరల్ జిల్లాలో మాదిపాడు నుంచి హరిశ్చంద్రాపురం వరకు జరుగుతున్న పనులకు..
రూరల్ ఎస్పీతో ఇన్లాండ్ వాటర్వేస్ ప్రతినిధులు
గుంటూరు, జూన్ 3: జాతీయ జలమార్గం - 4కు అనుసంధానంగా రూరల్ జిల్లాలో మాదిపాడు నుంచి హరిశ్చంద్రాపురం వరకు జరుగుతున్న పనులకు భద్రత కల్పించాలని ఇన్లాండ్ వాటర్వేస్ అధారిటి ఆఫ్ ఇండియా ఏపీ డైరెక్టర్ శ్రీనివాసరావు రూరల్ ఎస్పీ విజయరావును కోరారు. ఇందుకు సంబంధించి శ్రీనివాసరావు, సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షించారు. అనంతరం పోలీస్ కార్యాలయంలో రూరల్ ఎస్పీని కలిసి ప్రాజెక్టు వివరాలను వివరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ నుంచి నెల్లూరు జిల్లా తడ మీదగా వెళ్తున్న ఈ జల మార్గానికి అనుసంధానంగా అచ్చంపేట మండలం మాదిపాడు నుంచి తుళ్ళూరు మండలం హరిశ్చంద్రాపురం వరకు పనులు నిర్వహిస్తున్నామన్నారు. జల మార్గాల ద్వారా వివిధ రకాల సరుకు రవాణా చేసే సమయంలో వాటికి రక్షణగా రివర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి నదీ పరివాహక ప్రాంతాల్లో గస్తీ తిరుగుతూ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో హైడ్రో ఇంజనీర్ ప్రసాద్, కృష్ణానది పరిరక్షకుడు స్వరూప్ కుమార్, కృష్ణానది ఇన్స్సెక్టర్, తుళ్లూరు, సత్తెనపల్లి డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, విజయభాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.