బడబందలో.. ‘విత్తన’ కేంద్రం

ABN , First Publish Date - 2020-06-05T10:04:17+05:30 IST

ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్లలో విత్తనాల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా విత్తనాల సమస్యలు ..

బడబందలో.. ‘విత్తన’ కేంద్రం

 రూ.5 కోట్లతో నిర్మాణానికి రంగం సిద్ధం

స్థలాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు


టెక్కలి, జూన్‌ 4: ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్లలో విత్తనాల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా విత్తనాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నందిగాం మండలం శివరాంపురం పంచాయతీ బడబందలో ఏపీ సీడ్స్‌ విత్తన సేకరణ, శుద్ధి కేంద్రం ఏర్పాటుకు రూ.5కోట్లతో ప్రతిపాదించారు. ఇందుకు అవసరమైన గోదాముల నిర్మాణానికి ఏపీ స్టేట్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా పనులు చేపట్టేందుకు ఉత్తర్వులు మంజూరు చేశారు. బడబందకు సమీపంలో సర్వేనెం.149లో రాళ్లగుట్ట వద్ద ఐదెకరాల స్థలాన్ని జాతీయ రహదారికి నాలుగు కిలోమీటర్ల దూరంలో రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ స్థలం వివరాలను ఏపీ సీడ్స్‌ సంస్థకు అందజేశారు. జిల్లాలో సుమారు 2.10 లక్షల హెక్టార్లలో వరి పండిస్తున్నారు.


ఇందుకోసం ఏటా 75వేల క్వింటాళ్ల విత్తనాలను ఏపీ సీడ్స్‌ పంపిణీ చేస్తుండేది. జిల్లాలో అంపోలు వద్ద మాత్రమే ఏపీ సీడ్స్‌ ఆధ్వర్యంలో విత్తన సేకరణ కేంద్రం ఉంది. బడబందలో విత్తన సేకరణ, శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తే.. రైతులకు కొంతమేర లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ దిశగా వ్యవసాయ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. విత్తన సేకరణ, శుద్ధి కేంద్రం ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా గుర్తించినట్లు వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు తిరుమలరావు తెలిపారు.  బడబందలో విత్తన సేకరణ, శుద్ధి కేంద్రం ఏర్పాటుకు టీడీపీ హయాంలో ప్రతిపాదనలు ఉన్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని టెక్కలి నియోజకవర్గ కన్వీనర్‌ పేరాడ తిలక్‌ పేర్కొన్నారు. రైతులకు మేలు చేసేలా తమ ప్రభుత్వం.. విత్తన సేకరణ, శుద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడుతోందన్నారు. 

Updated Date - 2020-06-05T10:04:17+05:30 IST