కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యం: వీరేంద్ర సెహ్వాగ్
ABN , First Publish Date - 2021-11-10T00:46:43+05:30 IST
టీమిండియాలోకి ఎంతమంది ఆటగాళ్లు వచ్చినా కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయలేరని భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర
న్యూఢిల్లీ: టీమిండియాలోకి ఎంతమంది ఆటగాళ్లు వచ్చినా కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయలేరని భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తేల్చి చెప్పాడు. టీ20 ప్రపంచకప్లో భాగంగా నమీబియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో మూడో స్థానంలో కోహ్లీకి బదులు సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి రావడం అందరినీ ఆశ్చర్యపరించింది. దీంతో కోహ్లీ స్థానంపై సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ క్రికెట్ వెబ్సైట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ మాట్లాడుతూ జట్టులోకి ఎంతమంది ఆటగాళ్లు వచ్చినా కోహ్లీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని స్పష్టం చేశాడు. కోహ్లీ స్థానంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదని తేల్చి చెప్పాడు. కోరుకున్నంత కాలం కోహ్లీ టీ20లు ఆడతాడని అన్నాడు. అతడు నిలకడైన బ్యాట్స్మన్ అని కొనియాడాడు.
సెహ్వాగ్ అభిప్రాయంతో ఏకీభవించిన మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా.. బ్యాటింగ్లో కోహ్లీ స్థిరంగా రాణిస్తున్నాడని, అతడిలా మరెవరూ రాణించలేరని తేల్చి చెప్పాడు. అలాగే, జట్టు నిండి హిట్టర్లు ఉంటే సరిపోదని, కీలక సమయాల్లో జట్టును గట్టెక్కించగల సీనియర్లు కూడా అవసరమని పేర్కొన్నాడు.