ఆటో సహా 68 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
ABN , First Publish Date - 2022-01-29T06:41:06+05:30 IST
సత్యవేడు మండలం వెంకటరాజులకండ్రిగ గ్రామం వద్ద గురువారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సత్యవేడు, జనవరి 28: సత్యవేడు మండలం వెంకటరాజులకండ్రిగ గ్రామం వద్ద గురువారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ పురుషోత్తంరెడ్డి తెలిపిన వివరాల మేరకు.... అదనపు ఎస్ఐ వీరాంజనేయులు ఆధ్వర్యంలో పోలీసుల బృందం వెంకటరాజులకండ్రిగ గ్రామం వద్ద వాహనాల తనిఖీ చేపట్టింది. ఆ సమయంలో సత్యవేడు వైపు నుంచి వచ్చిన ఆటోను ఆపి తనిఖీ చేయగా పది బస్తాల రేషన్ బియ్యం కనిపించడంతో స్వాధీనం చేసుకున్నారు. సత్యవేడు మండలం అల్లపుగుంట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ భాస్కర్ను అదుపులోకి తీసుకుని రేషన్ బియ్యం తరలింపుపై విచారించారు. భాస్కర్ ఇచ్చిన సమాచారం మేరకు అతడి ఇంటిని కూడా తనిఖీ చేయగా మరో 58 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఆటోతో సహా మొత్తం 68 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం బస్తాలను, నిందితుడిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. భాస్కర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్ఐ పురుషోత్తంరెడ్డి తెలిపారు.