చోరీ సొత్తు స్వాధీనం
ABN , First Publish Date - 2021-01-26T05:56:10+05:30 IST
భోగాపురం మండల కేంద్రంలోని తోటవీధిలో ఈనెల 23న జరిగిన చోరీలో మూడు తులాల బంగారం, రూ.8,500 స్వాధీనం చేసుకున్నట్టు విజయనగరం డీఎస్పీ అనిల్కుమార్ చెప్పారు.
విజయనగరం క్రైం, జనవరి 25: భోగాపురం మండల కేంద్రంలోని తోటవీధిలో ఈనెల 23న జరిగిన చోరీలో మూడు తులాల బంగారం, రూ.8,500 స్వాధీనం చేసుకున్నట్టు విజయనగరం డీఎస్పీ అనిల్కుమార్ చెప్పారు. విజయ నగరం సబ్ డివిజన్ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. భోగాపురం తోట వీధికి చెందిన కోరుకొండ ఈశ్వరమ్మ ఈనెల 23న రాజమండ్రి వెళ్లగా, ఆమెకు పరిచయమైన అదే కాలనీకి చెందిన వ్యక్తి కదంబ మహేష్ ఆమె ఇంట్లోకి చొరబడి మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు దొంగిలించాడు. ఈశ్వరమ్మ రాజమండ్రి నుంచి ఇంటికి వచ్చి చూడగా ఆభరణాలు, నగదు దొంగతనానికి గురైనట్టు గుర్తించారు. వెంటనే భోగాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు సీఐ శ్రీధర్, ఎస్ఐ మహేష్, దర్యాప్తు చేపట్టి బీరువా లాకర్లో పడ్డ వేలిముద్రలు ఆధారంగా అనుమానితుడు మహేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం చేసినట్టు అంగీకరించాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్టు ఆయన చెప్పారు. కేసును చాకచక్యంగా చేధించిన సీఐ శ్రీధర్, ఎస్ఐ మహేష్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.