స్టీల్ ప్లాంట్ను అంగుళం కూడా అమ్మనివ్వం
ABN , First Publish Date - 2021-12-08T05:01:41+05:30 IST
విశాఖ స్టీల్ ప్లాంట్ను అంగుళం కూడా అమ్మనివ్వబోమని, ‘ఉక్కు’ను ప్రైవేట్పరం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం ఆగదని ఉక్కు పరిరక్షణ వేదిక చైర్మన్ సీహెచ్ నరసింగరావు స్పష్టం చేశారు.
ఉక్కు పరిరక్షణ వేదిక చైర్మన్ సీహెచ్ నరసింగరావు
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 250 రోజులకు చేరిన దీక్షలు
సిరిపురం, డిసెంబరు 7: విశాఖ స్టీల్ ప్లాంట్ను అంగుళం కూడా అమ్మనివ్వబోమని, ‘ఉక్కు’ను ప్రైవేట్పరం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం ఆగదని ఉక్కు పరిరక్షణ వేదిక చైర్మన్ సీహెచ్ నరసింగరావు స్పష్టం చేశారు. విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతున్న దీక్షలు మంగళవారం నాటికి 250వ రోజుకు చేరాయి. ఇందులో భాగంగా ఆట-పాట-మాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, విద్యుత్ సవరణ చట్టం-2020ను రద్దు చేయాలని నవంబరు 26 నాటికి ఢిల్లీలో పోరాటం ప్రారంభించి ఏడాది పూర్తయిందన్నారు. స్టీల్ ప్లాంట్ను ఒకేసారి అమ్ముతామన్న మోదీ ప్రభుత్వం చివరకు కార్మిక, ప్రజా పోరాటాలకు భయపడి దొడ్డిదారిన ముక్కలు ముక్కలుగా విక్రయించేందుకు ప్రయత్నిస్తోందని, దీనిని కూడా అడ్డుకుంటామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు, నాయకులు ఆర్కేఎస్వీ కుమార్, పడాల రమణ, కనకారావు, రామమూర్తి, కొండయ్య, మహిళా సంఘాల ఐక్య వేదిక నేతలు, అరుణోదయ కళామండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. కాగా ఆట-పాటలతో కళాకారులు ఆహూతులను ఆకట్టుకున్నారు.