సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వడ్డీ రేట్లు
ABN , First Publish Date - 2022-01-24T06:55:36+05:30 IST
వయో వృద్ధులకు బ్యాంకు ఎఫ్డీలపై ప్రత్యేక వడ్డీరేటును అందించాలని, పోస్టల్ సేవింగ్స్ పథకం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పెట్టుబడులపై పరిమితిని తొలగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కోరారు..
ఆర్థిక మంత్రిని కోరిన శివసేన ఎంపీ
న్యూఢిల్లీ: వయో వృద్ధులకు బ్యాంకు ఎఫ్డీలపై ప్రత్యేక వడ్డీరేటును అందించాలని, పోస్టల్ సేవింగ్స్ పథకం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పెట్టుబడులపై పరిమితిని తొలగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కోరారు. బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో సీతారామన్కు చతుర్వేది ఈ మేరకు లేఖ రాశారు. పొదుపు పథకాలపై తక్కువ వడ్డీరేట్లు సీనియర్ సిటిజన్లకు తక్కువ రిటైర్మెంట్ నిధులను మిగిల్చాయని, ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి కాలంలో వారిపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించాయని పేర్కొన్నారు. అధిక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వడ్డీరేట్లు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ఎఫ్డీలపై వడ్డీ 12 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గిందన్నారు. పోస్టాఫీసుల పొదుపు ఖాతాల్లో పెట్టుబడు లపై రూ.15 లక్షల పరిమితి వరకు వడ్డీ దాదాపు ఏడు శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. పీపీఎఫ్ విషయానికి వస్తే వార్షికంగా కేవలం రూ.1.5 లక్షల పరిమితి ఉందని, పీపీఎఫ్ మినహా ఇవన్నీ పన్ను పరిధిలోకి వస్తాయని గుర్తు చేశారు. వడ్డీరేట్లను తగ్గించడం వల్ల సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ ఉద్యోగులు తమ కుటుంబాలను నడిపేందుకు తగినంత ఆదాయం పొందడం కష్టతరంగా మారిందని పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్లు, పదవీ విరమణ పొందిన వారి ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకు ఎఫ్డీలపై ప్రత్యేక వడ్డీరేటును అందించాలని నిర్మలా సీతారామన్ను ఆమె కోరారు. పోస్టాఫీసు సేవింగ్స్ పథకం, పీపీఎఫ్పై ఉన్న పరిమితిని తొలగించాలని కూడా అభ్యర్థించారు.