సీనియర్‌ పాత్రికేయుడు తుర్లపాటి కన్నుమూత

ABN , First Publish Date - 2021-01-12T08:19:35+05:30 IST

సీనియర్‌ పాత్రికేయుడు, ప్రముఖ వక్త తుర్లపాటి కుటుంబరావు ఇక లేరు. ఆదివారం అర్ధరాత్రి విజయవాడలో ఆయన కన్నుమూశారు.

సీనియర్‌ పాత్రికేయుడు తుర్లపాటి కన్నుమూత

  • శ్వాస సంబంధ సమస్యతో ఆగిన ఊపిరి 
  • విజయవాడలో అంత్యక్రియలు పూర్తి
  • సుదీర్ఘకాలం ‘ఆంధ్రజ్యోతి’లో బాధ్యతలు
  • ఉపన్యాసాలతో గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లోకి
  • 2002లో పద్మశ్రీ బిరుదుతో సత్కారం
  • ఆంధ్రకేసరికి సహాయకుడిగా విధులు

విజయవాడ, అమరావతి, న్యూఢిల్లీ, జనవరి 11(ఆంధ్రజ్యోతి): సీనియర్‌ పాత్రికేయుడు, ప్రముఖ వక్త తుర్లపాటి కుటుంబరావు ఇక లేరు. ఆదివారం అర్ధరాత్రి విజయవాడలో ఆయన కన్నుమూశారు. నగరంలోని శిఖామణి సెంటర్లో నివాసం ఉంటున్న ఆయనకు శ్వాస సంబంధ సమస్య తలెత్తడంతో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు. ఆయన వయసు 87 ఏళ్లు. 1933 ఆగస్టు 10న విజయవాడలో ఆయన జన్మించారు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు సంపాదకీయాలకు ఆకర్షితుడైన తుర్లపాటి 14 ఏళ్ల వయసులోనే పత్రికా రంగంలోకి అడుగుపెట్టిన ఆయన అనేక పత్రికల్లో పనిచేశారు. ఆయన మంచి వక్త కూడా. తన ఉపన్యాసాలతో గిన్నిస్‌ బుక్‌లోనూ స్థానం సంపాదించారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం 2002లో పద్మశ్రీతో సత్కరించింది. 


‘ఆంధ్రజ్యోతి’తో సుదీర్ఘ అనుబంధం..

తుర్లపాటి తొలుత మద్రాసు నుంచి వెలువడే మాతృభూమి రాజకీయ వారపత్రికలో ‘స్వరాజ్యం లో స్వరాష్ట్రం’ శీర్షికకు వార్తారచన చేశారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ వ్యాసం రాశారు. ఆ తర్వాత వివిధ పత్రికల్లో పనిచేశారు. ఎన్‌జీ రంగా నిర్వహించిన వాహిని పత్రికకు సహ సంపాదకుడిగా, చలసాని రామారాయ్‌ నడిపిన ప్రతిభ పత్రికకు సంపాదకుడిగా, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నిర్వహించిన ప్రజాపత్రికలో ఆంధ్ర ప్రాంత వార్తల సంపాదకుడిగా పనిచేశారు. 1955లో డాక్టర్‌ టీవీఎస్‌ చలపతిరావు స్థాపించిన ప్రజాసేవ పత్రికలో పనిచేశారు. 1965 నుంచి 1991 వరకు ‘ఆంధ్రజ్యో తి’ దినపత్రిక ఎడిటోరియల్‌ విభాగంలో కీలక బా ధ్యతలు నిర్వర్తించారు. ‘ఆంధ్రజ్యోతి’ అనుబంధ పత్రిక జ్యోతిచిత్రకు సుదీర్ఘకాలం సంపాదకుడిగా వ్యవహరించారు.


1960 నుంచి 2010 వరకు ‘వార్తల్లోని వ్యక్తి’ శీర్షికనన ఆయన వ్యాసాలు రాశారు. తుర్లపాటి మంచి వక్త కూడా. అర్ధశతాబ్ద కాలంలో ఉపన్యాసకుడిగా, సభలకు అధ్యక్షత వహించిన వ్యక్తిగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. 2010 జూన్‌ 21న సమైక్య రాష్ట్రం లో గ్రంథాలయ పరిషత్‌ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన భార్య కృష్ణకుమారి క్యాన్సర్‌తో మరణించగా, ఆమె స్మారకార్థం ప్రతిభామూర్తులకు ఏటా అవార్డులు అందజేస్తున్నారు.   కుమారుడు జవహర్‌లాల్‌ వద్ద ఆయన ఉంటున్నారు. తుర్లపాటికి విజయవాడ రామలింగేశ్వర నగర్‌ శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు.


Updated Date - 2021-01-12T08:19:35+05:30 IST